Congress Party: ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం.. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు

అందుకోసం ముందు పార్టీ బలహీనతలు, లోటుపాట్లు, లోపాలను గుర్తించాలి. వాటి సరిదిద్దుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని ప్రారంభించింది. ఏ రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో.. ఆ రాష్ట్రాల్లో ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. ఇందుకోసం ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో నిజనిర్థారణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో...

Congress Party: ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం.. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు
Congress Party
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 20, 2024 | 10:05 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ విపక్ష కూటమిలో ఉత్సాహాన్ని నింపాయి. విజయానికి దాదాపు సమీపానికి వచ్చి కొద్ది తేడాలో వెనుకబడినప్పటికీ.. 18వ లోక్‌సభలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్లు కనీస ప్రతిపక్ష హోదాను కూడా అందించలేకపోయాయి. కానీ ఈసారి 99 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకుని, నేతల్లో భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపజేసింది. అయితే ఇంతటితో సరిపెట్టుకుంటే కుదరదు. ఈసారి కొద్ది తేడాలో చేజారిన విజయాన్ని ఐదేళ్ల తర్వాత అందుకోవాలంటే ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలి.

అందుకోసం ముందు పార్టీ బలహీనతలు, లోటుపాట్లు, లోపాలను గుర్తించాలి. వాటి సరిదిద్దుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని ప్రారంభించింది. ఏ రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో.. ఆ రాష్ట్రాల్లో ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. ఇందుకోసం ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో నిజనిర్థారణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, పేలవమైన పార్టీ పనితీరుపై అధ్యయనం చేయనున్నాయి. అనంతరం అధిష్టానానికి నివేదిక అందించనున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది.

మధ్యప్రదేశ్:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం స్థానాలను భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. 2019లో కూడా బీజేపీదే పైచేయి. ఆ ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగతా అన్నింటినీ గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో పొరుగునే ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు గతం కంటే చాలా మెరుగుపడి గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుపొందగా.. మధ్యప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు మారిందన్నదే కాంగ్రెస్ అధిష్టానాన్ని వేధిస్తున్న ప్రశ్న. పైగా బీజేపీ ఏకంగా 59.27% ఓట్లను పొందగా, కాంగ్రెస్ కేవలం 32.44% ఓట్లు మాత్రమే పొందగల్గింది. ఇంత ఘోర పరాజయం చవిచూసిన రాష్ట్రంలో పార్టీ స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం అధిష్టానం పృథ్వీరాజ్ చవాన్, సప్తగిరి ఉలాక, జిగ్నేష్ మేవానీతో కమిటీని ఏర్పాటు చేసింది.

చత్తీస్‌గఢ్:

మధ్యప్రదేశ్‌కు ఆనుకునే ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనూ దాదాపు ఇదే తరహాలో ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 11 లోక్‌సభ సీట్లలో బీజేపీ 10 గెలుచుకోగా, కాంగ్రెస్ 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ సగానికి పైగా ఓట్లతో (52.65%) ఆధిక్యత ప్రదర్శించగా కాంగ్రెస్ 41.06% ఓట్లు వచ్చాయి. ఏడాది క్రితం వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం జారవిడుచుకుంది. ఇక్కడి వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయడం కోసం పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీతో పాటు హరీష్ చౌదరిగి బాధ్యతలు అప్పగించింది.

ఒడిశా:

ఒడిశా రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా బిజూ జనతా దళ్ (BJD) అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ స్థాయిని కూడా కోల్పోయింది. ఇదే సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా ప్రవేశించిన బీజేపీ, గత ఎన్నికల్లో ఏకంగా అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్ సీట్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రంలోని 21 స్థానాల్లో బీజేపీ 20 గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 1 స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ రాష్ట్రంలో పార్టీ పురోగతి లేకపోవడం, ప్రాంతీయ పార్టీ బలహీనపడినప్పటికీ.. దాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా వినియోగించుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చూస్తుండగానే.. బీజేపీ ఆ రాష్ట్రంలో పాగా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు పుంజుకోలేకపోతుంది అన్న అంశంపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి నివేదిక అందించే బాధ్యతను అజయ్ మాకెన్, తారిఖ్ అన్వర్ భుజాలపై పెట్టింది.

ఢిల్లీ, ఉత్తారాఖండ్, హిమాచల్ ప్రదేశ్:

కాంగ్రెస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనీయకుండా పూర్తిగా అన్ని స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. ఢిల్లీలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తూ వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని 5 స్థానాలు, హిమాచల్‌లోని 4 స్థానాలను కూడా బీజేపీ ఇదే మాదిరిగా గెలుస్తూ వస్తోంది. నిజానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసింది. రాష్ట్రంలోని 7 స్థానాల్లో ఆప్ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల పోటీ చేశాయి. అయినా సరే బీజేపీ 54.35% ఓట్లు సాధించి, ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఇక్కడ పొత్తులు ఫలించకపోవడం సహా సంస్థాగతంలో నెలకొన్న సమస్యలపై అధిష్టానం దృష్టి సారించింది. అలాగే హిమాలయ రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కాషాయదళ ఆధిపత్యానికి ఎలా చెక్ పెట్టాలన్నది కూడా ఆ పార్టీకి సవాలుగా మారింది. పైగా హిమాచల్‌లో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. అందుకే ఈ మూడు రాష్ట్రాల్లో స్థితిగతులను, లోటుపాట్లను అధ్యయనం చేయడం కోసం సీనియర్ నేతలు పీఎల్ పూనియా, రంజని పాటిల్‌కు బాధ్యతలు అప్పగించింది.

కర్ణాటక:

దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అలాంటి రాష్ట్రంలో 2019లో మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 25 గెలుపొందగా, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) చెరొక సీటు గెలుచుకున్నాయి. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి సుమలత గెలుపొందారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17, దాని మిత్రపక్షంగా ఉన్నజేడీ(ఎస్) 2 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ తన స్కోరును 9 వరకు పెంచుకోగలిగింది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్ని తక్కువ స్థానాలు సాధించడం ఆ పార్టీ అధినాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్రంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకున్న ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది నిజమో తెలుసుకునేందుకు అధిష్టానం సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో గౌరవ్ గగోయ్, హిబి ఈడెన్‌తో నిజనిర్థారణ కమిటీ వేసింది.

తెలంగాణ:

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీకి కొత్త ఉత్సాహం, ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలందించే సీనియర్ నేతలను కాదని మరీ రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన అధిష్టానం ఈ రాష్ట్రం నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లను ఆశించింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా.. 2019లో కాంగ్రెస్ 3 మాత్రమే గెలుచుకుంది. ఆ సమయంలో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 1 సీటు గెలుచుకున్నాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాల నుంచి 8 స్థానాలకు పెరిగింది.

అయితే అదే సమయంలో బీజేపీ కూడా 4 సీట్ల నుంచి 8 సీట్లకు ఎగబాకి కాంగ్రెస్‌కు సమవుజ్జీగా నిలిచింది. పోలైన ఓట్లలో 40.10% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ, 35.08% ఓట్లు సాధించిన బీజేపీ చెరి సగం సీట్లను పంచుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు 16.68% కు కుదించుకుపోయింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయిందని, అందుకే బీజేపీ పుంజుకుందని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. పైగా రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోగా, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యతను చాటుకుంది. ఈ స్థితిగతులపై అధ్యయనం కోసం కాంగ్రెస్ అధిష్టానం పీజే కురియన్, రకీబుల్ హుస్సెన్, పర్గత్ సింగ్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పుడు తెలంగాణ ఫలితాలను విశ్లేషించి అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమికి కారణాలను అన్వేషించుకుని లోటుపాట్లను గుర్తించగల్గితే, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా తదుపరి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఆత్మపరిశీలన కసరత్తు ఆ పార్టీకి ఎంత మేర ఉపయోగపడుతుంది అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..