AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెన్షన్‌ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. కేంద్రం నుంచి కీలక ఆదేశాలు.. ఇకపై ప్రతీ నెలా..

పెన్షన్‌దారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇకపై బ్యాంకులన్నీ వారికి పేమెంట్ స్లిప్స్ పంపించాలని ఆదేశించింది. దీని వల్ల వారికి అన్నీ వివరాలు తెలుస్తాయని తెలిపింది. అన్ని వయస్సువారు చదివేలా స్లిప్ సరళమైన భాషలో ఉండాలని స్పష్టం చేసింది.

పెన్షన్‌ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. కేంద్రం నుంచి కీలక ఆదేశాలు.. ఇకపై ప్రతీ నెలా..
Pension
Venkatrao Lella
|

Updated on: Dec 02, 2025 | 1:58 PM

Share

పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ప్రభుత్వం నుంచి పెన్షన్‌ పొందేవారికి ప్రతీ నెలా బ్యాంకులు పెన్షన్ పేమెంట్ స్లీప్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా బ్యాంకులకు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఫ్యామిలీ పెన్షన్‌దారులకు కూడా పేమెంట్ స్లిప్స్ ఇవ్వాలని సూచించింది. పెన్షన్ పొందే ప్రతిఒక్కరికీ ఇవ్వాలని, ఏ ఒక్కరికీ కూడా ఇవ్వకుండా ఉండొద్దని తెలిపింది. తమకు పెన్షన్ పేమెంట్ స్లిప్స్ అందటం లేదంటూ ఇటీవల కొంతమంది ఫిర్యాదులు చేశారు. దీంతో ఆర్ధిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మెయిల్స్‌‌కు లేదా ఇతర మార్గాల ద్వారా పెన్షన్‌దారులకు పేమెంట్ స్లిప్‌లు ఇవ్వాలని బ్యాంకులను కోరింది. పెన్షన్‌దారుల వివరాలు లేకపోతే కలెక్ట్ చేసుకుని వారి ఈమెయిల్‌కు పంపాలని సూచించింది. గతంలో 2024 ఫిబ్రవరిలో దీనిపై ఆర్ధికశాఖ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని బ్యాంకులు ఆ నిబంధనలు పాటించడం లేదు. దీంతో పెన్షన్‌దారుల నుంచి అనేక కంప్లైంట్లు ఆర్ధికశాఖకు అందాయి. దీంతో మళ్లీ బ్యాంకులకు గుర్తు చేసింది. ఈమెయిల్, వాట్సప్, ఎస్‌ఎంఎస్ వంటి మార్గాల ద్వారా పెన్షన్ పేమెంట్ చేసినట్లు స్లిప్‌లు పంపాలని సూచించింది. దీని వల్ల పెన్షన్‌దారులకు క్లారిటీ ఉంటుందని తెలిపింది.

పేమెంట్ స్లిప్ ద్వారా తమకు ఎంత పెన్షన్ అకౌంట్‌లో పడింది. ఎంత డిడక్ట్ అయింది.. బకాయిలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలుస్తాయి. దీని వల్ల తమ ఆర్ధిక అవసరాలను పెన్షన్‌దారులు ప్లాన్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమయ్యే భాషలో పేమెంట్ స్లిపులు ముద్రించాలని, ఎవరైనా వివరాలు సులువుగా తెలుసుకునేలా ఉండాలని బ్యాంకులకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

Follow Us