పశ్చిమబెంగాల్‌పై సీరియస్‌గా ఉన్న కేంద్రం .. రాష్ట్ర సీఎస్, డీజీపీలను ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ..

పశ్చిమబెంగాల్‌పై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. జేపీ నడ్డాపై జరిగిన రాళ్లదాడి కేంద్రం, రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది.

పశ్చిమబెంగాల్‌పై సీరియస్‌గా ఉన్న కేంద్రం .. రాష్ట్ర సీఎస్, డీజీపీలను ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ..
Follow us

|

Updated on: Dec 12, 2020 | 7:24 AM

పశ్చిమబెంగాల్‌పై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. జేపీ నడ్డాపై జరిగిన రాళ్లదాడి కేంద్రం, రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌ వద్ద బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళుతున్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ జెండాలు పట్టుకున్న వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్ రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి లేఖ పంపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రకటించారు.

అనంతరం రాజ్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనకు, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని వ్యక్తులు, బయటి వ్యక్తులు అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. నిప్పుతో చెలగాటం ఆడొద్దని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గవర్నర్‌ వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలవడంపై తృణమూల్‌ ఎంపీలు సౌగతరాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గవర్నర్ పంపిన లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఈ నెల 14న హోం శాఖ కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమావేశానికి ఇద్దరు ఉన్నతాధికారులను పంపించరాదని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ, నడ్డా కాన్వాయ్‌ మీద దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, తగు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఢిల్లీలో సమావేశం నుంచి రాష్ట్ర అధికారులను మినహాయించాలని కోరారు.