Telangana: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ మరికొంత ఆలస్యం.. ఖర్గే లేకపోవడంతో ఈ నెల 30కి వాయిదా పడ్డ కీలక సమావేశం
Telangana Cabinet Expansion: ‘మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపామన్న పిసిసి.. తెలంగాణ క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరామన్నారు. త్వరగా క్యాబినేట్ కూర్పు చేయాలని రాహుల్ ని విజ్ఞప్తి చేశామని త్వరలో ఉంటుందని..

రాష్ట్ర క్యాబినేట్ విస్తరణ ముహూర్తం మరోసారి వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30 కి మీటింగ్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రకృతి చికిత్స లో ఉన్న ఖర్గే షెడ్యూల్ ప్రకారం సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే.. వైద్యుల సూచలన మేరకు ఆయన చికిత్స్ మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 వ తేదిన ఖర్గే ఢిల్లీ చేరుకోనున్నారు. దీంతో రెండు రోజులు ఎదురు చూపుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వెనుదిరిగారు. సోమవారం అక్బర్ రోడ్ లోని జన్ పథ్ 10 లో రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు వేరు వేరుగా భేటి అయ్యారు. సాయంత్రం 5:15 కు ప్రారంభమైన ఈ సమావేశం గంట పాటు సాగింది.
తొలుత కేసీ వేణుగోపాల్ కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ బై ఎలక్షన్ కు సంబంధించి పార్టీ అభ్యర్థి ప్రకటనపై చర్చించారు. ఇక్కడి నుంచి ఆర్యదన్ షౌకత్ ను బరిలోని నిలిపాలని నిర్ణయించారు. అనంతరం తెలంగాణ మంత్రి వర్గ కూర్పుతో పాటు, పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను రాహుల్ కు బ్రీఫ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఐదు బెర్త్ లకు సంబంధించి ఏడుగురి పేర్లను ప్రియార్టీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్ట్ ను సమర్పించారు. వీటిపై కేసీ వేణుగోపాల్ బ్రీఫ్ చేయగా.. అనంతరం పీసీసీ చీఫ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసారు. కుటుంబ వారితో కాసేపు ముచ్చటించిన రాహుల్, తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ తో ప్రత్యేకంగా భేటి అయ్యారు.
క్యాబినేట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీసారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా క్యాబినేట్ విస్తరణ చేపట్టాలని, అందులో బీసీలకు రెండు పదవులు ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ ని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం బీసీ కుల గణన తో దేశ వ్యాప్తంగా వెళ్తోన్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం పార్టీకి మరింత కలిసి వస్తుందని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అలాగే కార్యవర్గంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.
క్యాబినేట్ విస్తరణ త్వరగా చేయాలని రాహుల్ గాంధీనీ కోరా: పీసీసీ
వీలైనంత త్వరగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తమ రిక్వెస్ట్ పై రాహుల్ సానుకూలంగా స్పందించారని త్వరగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసినట్లు మహేశ్ కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలిపారు.
‘మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపామన్న పిసిసి.. తెలంగాణ క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరామన్నారు. త్వరగా క్యాబినేట్ కూర్పు చేయాలని రాహుల్ ని విజ్ఞప్తి చేశామని త్వరలో ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని వెళ్లడించారు. అయితే కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ పై సీఎంతో కలిసి సమావేశం ఉంటుందా అనే అంశంపై తనకు క్లారిటీ లేదని చెప్పారు.
సీఎంతో పీసీసీ భేటి..
రాహుల్ తో భేటి అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా తుగ్లక్ రోడ్ 23 లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు సీఎంతో చర్చించారు. రాహుల్ తో భేటి సందర్భంగా జరిగిన అంశాలను బ్రీఫ్ చేశారు. ప్రస్తుతం ఖర్గే అందుబాటులో లేనందున ఈ నెల 30 కి మీటింగ్ ను వాయిదా వేసిన విషయాన్ని వివరించారు. అయితే.. ఇప్పటికే రెండు రోజులు వేచి చూసిన నేపథ్యంలో మరో రెండు రోజులు పాటు ఢిల్లీలో ఉండేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి బయలుదేరారు. కాగా.. రెండు రోజులు పర్యటనలో రాహుల్ తో సీఎం భేటి కాకపోవడంపై కొత్త చర్చ మొదలైంది. పీసీసీ చీఫ్ కు అపాయిట్మెంట్ ఇచ్చిన రాహుల్.. సీఎంకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ అపాయిట్మెంట్ కోరలేదా..? లేక కోరిన రాహుల్ ఇవ్వలేదా? అన్న ప్రశ్న నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
