Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Plan: సీఎంల ఎంపికలో ఖతర్నాక్ వ్యూహం.. చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీ, మధ్యప్రదేశ్‌లో బీసీ, రాజస్థాన్‌లో ఓసీకి సీఎం పదవి

మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా, ఈ రాష్ట్రాల్లో కుల సమీకరణాలు సృష్టించాలని కూడా బీజేపీ కన్నేసింది.

BJP Plan: సీఎంల ఎంపికలో ఖతర్నాక్ వ్యూహం.. చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీ, మధ్యప్రదేశ్‌లో బీసీ, రాజస్థాన్‌లో ఓసీకి సీఎం పదవి
Narendra Modi, Amit Shah, Jp Nadda
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 12, 2023 | 5:17 PM

మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ ఖతర్నాక్‌ వ్యూహాన్ని అమలు చేసింది. అన్ని వర్గాలను ఆకట్టకునేవిధంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ల్లో సీఎంల ఎంపిక జరిగింది. ఉత్తరాదిలో ఓబీసీ ఓటు బ్యాంక్‌పై ప్రధానంగా బీజేపీ గురిపెట్టింది. అందుకే మధ్యప్రదేశ్‌ సీఎం పదవిని మోహన్‌ యాదవ్‌కు కట్టబెట్టారు. దీని ప్రభావం ఉత్తర ప్రదేశ్, బీహార్‌లో గట్టిగా ఉంటుందని బీజేపీ హైకమాండ్‌ భావిస్తోంది.

మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా, ఈ రాష్ట్రాల్లో కుల సమీకరణాలు సృష్టించాలని కూడా బీజేపీ కన్నేసింది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది. ఎవరు ఊహించని విధంగా మూడు రాష్ట్రాల్లో అందుకే ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారు. బ్రాహ్మణ ఓటు బ్యాంక్‌ కూడా ఉత్తరాదిలో కీలకం. అందుకే రాజస్థాన్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీఎం పదవి ఇచ్చారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,చత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ కలిపి నార్త్‌బెల్ట్‌లో 200కు పైగా లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అందుకే సీఎంల ఎంపికలో సామాజిక వర్గాలను ఎక్కువగా పరిగణ లోకి తీసుకున్నారు.

ఎంపీ సీఎంగా మోహన్ యాదవ్‌

మధ్యప్రదేశ్‌లో కుల సమీకరణాలతో రాజకీయాలు ఎక్కువ. ముఖ్యంగా కాంగ్రెస్ ఓబీసీ సమస్యను నిరంతరం లేవనెత్తుతోంది. అటువంటి పరిస్థితిలో, మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జనంలో ఆదరణ పొందడంతో పాటు, ఒక వైపు కాంగ్రెస్‌కు బీజేపీ సమాధానం ఇచ్చినట్లైంది. మరోవైపు ఓబీసీ ఓట్లను రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లలో ఓబీసీ ఓటు చాలా ముఖ్యమైనదిగా పరిగణించడం గమనార్హం. అటువంటి పరిస్థితిలో, మోహన్ యాదవ్‌ను ముందుకు తెచ్చి, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అద్భుతమైన రాజకీయ పిచ్‌ను సిద్ధం చేసింది.

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ

అదే సమయంలో రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మను ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. గణాంకాల ప్రకారం, రాజస్థాన్‌లో 89 శాతం హిందువుల జనాభా ఉంది. వీరిలో షెడ్యూల్డ్ కులాల జనాభా 18 శాతం కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 13 శాతం. బ్రాహ్మణుల జనాభా దాదాపు ఏడు శాతం. అటువంటి పరిస్థితిలో, భాజన్‌లాల్ శర్మను ముందుకు తెచ్చి బ్రాహ్మణ ఓటర్లను ప్రలోభపెట్టడానికి బీజేపీ ప్రయత్నించింది. తన పటిష్టమైన ఓటర్లపై తన పట్టును కొనసాగించేందుకు, బీజేపీ బ్రాహ్మణ వ్యక్తిని ముందుకు తెచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లో విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ

ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓటర్లపై కన్నేసి ఉంచిన బీజేపీ గిరిజన ఓటర్లపై పట్టు పెంచుకునేందుకు విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ హైకమాండ్. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓటర్లను నిర్ణయాత్మకంగా పరిగణిస్తారు. ఇక్కడి జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది గిరిజనులు. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 29 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఇది కాకుండా రాష్ట్రంలో 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 4 సీట్లు గిరిజన వర్గానికి రిజర్వ్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గిరిజన సామాజికవర్గం నుండి ముఖ్యమంత్రిని చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ చేసిన ఎత్తుగడ గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసించే జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణలోనూ బీసీ మంత్రం

అటు తెలంగాణలోనూ బీసీ, ఎస్సీ ఓటర్లకు గాలం వేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అకస్మాత్తుగా వ్యూహం మార్చిన బీజేపీ బీసీలకు సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. జనాభా పరంగా తెలుగు నేల బీసీలు 50 శాతానికి పైగానే ఉన్నప్పటికీ రాజకీయ చైతన్యం ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తక్కువేనని అభిప్రాయం ఉంది. వివిధ పార్టీలలో బీసీ నాయకులకు పదవులు లభించినా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరూ ఎదగలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీసీ మంత్రంతో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…