West Bengal By Poll: బెంగాల్లో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్.. సీఎం మమత బరిలో ఉన్న భవానిపూర్లో ఉద్రిక్తత!
West Bengal by Election: తీవ్ర ఉద్రిక్తత మధ్య బెంగాల్ లోని భవానిపూర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచారు.
Bhabanipur bypoll: తీవ్ర ఉద్రిక్తత మధ్య బెంగాల్ లోని భవానిపూర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే, తృణమూల్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. ఓ పోలింగ్బూత్లో 12 మంది దొంగ ఓటర్లను పట్టుకున్నామని తెలిపారు బీజేపీ నేత కళ్యాణ్ చౌబే. కాగా, ఈ ఆరోపణల్లో నిజం లేదని టీఎంసీ నేతలు కౌంటరిచ్చారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కళ్యాణ్ చౌబే కారు ధ్వంసమయ్యింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ నుంచి లాయర్ ప్రియాంక టిబ్రేవాల్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య పోటా పోటీ నెలకొంది. భవానీపూర్తో పాటు జాంగీపుర్, సంషేర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికి కొన్ని ప్రాంతాల్లో తృణమూల్ , బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. నందిగ్రామ్లో సుబేందు అధికారి చేతిలో ఓడిపోయిన మమత..6 నెలల్లోగా ఎమ్మ్యెల్యేగా ఎన్నికల కావలసి ఉంది. దీంతో ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
కాగా, సీఎం పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు కట్టదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్ల సమీపంలో సెక్షన్ 144 విధించారు. నియోజకవర్గంలో 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన జవాన్లు మోహరించారు. పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్కతాకు చెందిన పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు అక్టోబరు 3న వెలువడనున్నాయి.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత తన ఓటు వినియోగించుకున్నారు. ఆతర్వాత భబానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్ బాగా జరిగిందని టీఎంసీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఇదిలా ఉండగా, తమ నాయకుడు కళ్యాణ్ చౌబేపై దాడి జరిగిందని బిజెపి ఆరోపించింది. అయితే, టీఎంసీ ఈ ఆరోపణలను ఖండించింది. సాయంత్రం 5 గంటల వరకు, భబానీపూర్ 53.32 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. నెమ్మదిగా ప్రారంభమైన తర్వాత, భబానీపూర్ మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 36% ఓటింగ్ నమోదైంది. సంసర్గంజ్ 57.15% , జాంగిపూర్ 53.78 పోలింగ్ నమోదైంది.