భార్యను చంపి.. రాత్రంతా మృతదేహంతో..! బెంగళూరు హత్య కేసులో సంచలన నిజాలు..
బెంగళూరులోని హులిమావు సమీపంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి రాకేష్ తన భార్య గౌరీని ఉద్యోగ వివాదం కారణంగా కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని సూట్కేసులో దాచిపెట్టాడు. పోలీసులు రాకేష్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో గౌరీ ఉద్యోగం కోసం జరిగిన గొడవలే ప్రధాన కారణం.

భార్యను కత్తితో పొడిచి చంపేసి.. ఆ తర్వాత ముక్కలుగా నరికి ఓ స్కూట్కేసులో కుక్కేసి.. బాత్రూమ్లో పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన బెంగళూరులో హులిమావు సమీపంలోని దొడ్డ కన్నహళ్లిలోని చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32) ను హత్య చేశాడు. ఈ ఘటనలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అసలు రాకేష్ తన భార్యను ఎందుకు హత్య చేశాడు? ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయనే కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాకేష్, గౌరీ ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ గతంలో మహారాష్ట్రలో నివశించేవారు.
అయితే రాకేష్ ఉద్యోగ రిత్యా వాళ్లు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. దీంతో గౌరీ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ.. బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా.. తనకు మంచి జాబ్ దొరకడం లేదని, అందుకు కారణం తన భర్త ఉద్యోగం కోసం ఇక్కడి రావడమే అంటూ గౌరీ తరచూ భర్త రాకేష్తో గొడవపడేది. మళ్లీ తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోదామంటూ రాకేష్ను కోరేది. నీ ఉద్యోగం వల్ల నాకు జాబ్ లేకుండా పోయిందంటూ భర్తను నిందించేది. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 26న కూడా ఇదే విషయంలో గొడవ జరిగి, ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, రాకేష్ గౌరీపై చేయి చేసుకున్నాడు. దీంతో గౌరీ భర్తను పొడిచేందుకు ఓ కత్తి తీసుకొని రాగా, కోపోద్రిక్తుడైన రాకేష్ అదే కత్తితో గౌరీపై విచక్షణా రహితంగా పొడిచేశాడు. దాంతో గౌరీ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక.. రాకేష్ ఆమె మృతదేహాన్ని ఓ సూట్కేస్లో పెట్టాడు.
ఆ రోజు రాత్రి ఆ మృతదేహంతో తాను మాట్లాడుతూ కూర్చున్నట్లు రాకేష్ పోలీసులకు వెల్లడించాడు. మరుసటి రోజు పుణేకు పారిపోయాడు. అయితే.. రాకేష్ తన తండ్రికి ఫోన్ చేసి భార్యను చంపిన విషయాన్ని వెల్లడించాడు. తనన టార్చర్ చేస్తున్న భార్యను చంపేశానని, ఈ విషయాన్ని అందరికి చెప్పాలని, ముఖ్యంగా గౌరీ వాళ్ల అమ్మకు చెప్పాలని తండ్రితో చెప్పాడు. ఇదే విషయాన్ని రాకేష్ తండ్రి, గౌరీ అమ్మకు చెప్పగా.. వాళ్లు మహారాష్ట్ర పోలీసులను ఆశ్రయించడం, అక్కడి పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించడంతో లోకల్ పోలీసులు వెళ్లి ఇల్లు తనిఖీ చేయగా గౌరీ మృతదేహం సూట్కేసులో లభించింది. ఆ తర్వాత పుణేలో పోలీసులు రాకేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఉద్యోగం కోసం గొడవ నిండు ప్రాణాలు బలితీసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




