మయన్మార్, థాయిలాండ్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. అన్ని విధాలా సాయం చేస్తామన్న మోదీ
థాయిలాండ్, మయన్మార్లలో సంభవించిన వినాశకరమైన భూకంపం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం నుండి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రెండు దేశాలకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం వల్ల సంభవించిన భయంకరమైన విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం తర్వాత పరిస్థితి గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానన్నారు. భారతదేశం అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో, భారత్ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు కొనసాగించడం గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చ జరిగింది.
మయన్మార్లో సంభవించిన భూకంపం కారణంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో సంభవించిన విధ్వంసం హృదయ విదారకంగా ఉంది. మార్చి 28న, మయన్మార్ను 7.7, 6.4 తీవ్రతతో భూకంపాలు తాకాయి. దీని కేంద్రం రాజధాని నగరానికి వాయువ్యంగా కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగింగ్ సమీపంలో ఉంది. మయన్మార్ భూకంపంలో వందలాది భవనాలు కుప్పకూలాయి. శిథాలాల కింద చిక్కుకున్న వేలాది మందిని బయటకు తీసేందుకు సహాయక చర్చలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.
Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…
— Narendra Modi (@narendramodi) March 28, 2025
ఏళ్ల చరిత్ర ఉన్న అవా బ్రిడ్జి సైతం నేలమట్టమైంది. థాయ్లాండ్లో వందల బౌద్దరామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అన్నీ విమాన సర్వీసులను రద్దు చేసి.. ఎయిర్పోర్ట్ను లాక్డౌన్ చేశారు. భూకంపం ఎఫెక్ట్తో ఇటు బ్యాంకాక్లో ట్రైన్లు సైతం ఊగాయి. దీంతో బ్యాంకాక్లో మెట్రో, రైలు సేవలు పూర్తిగా నిలిపివేశారు. మయన్మార్ భూకంపం ఎఫెక్ట్తో భారత్లోనూ పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మేఘాలయా, కోల్కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూమి కంపించింది. ఇంఫాల్లో భయాందోళనతో జనం పరుగులు తీశారు. మేఘాలయాలో భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..