ఇథనాల్ రహిత పెట్రోల్ ఉండదు! E20పై సమస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం
E20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనది, పర్యావరణహితమైనది, సాంకేతికంగా మెరుగైన ఇంధనమని, E20 పెట్రోల్ను ఉపసంహరించుకోవడం లేదా తిరిగి ఇథనాల్ తక్కువగా కలిపిన పెట్రోల్కు వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పార్లమెంట్కు తెలిపారు.

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న E20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనది, పర్యావరణహితమైనది, సాంకేతికంగా మెరుగైన ఇంధనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. E20 పెట్రోల్ను ఉపసంహరించుకోవడం లేదా తిరిగి ఇథనాల్ తక్కువగా కలిపిన పెట్రోల్కు వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పార్లమెంట్కు తెలిపారు. పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతం (E20) కంటే ఎక్కువకు పెంచే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోలేదని మంత్రి వెల్లడించారు. తక్కువ ప్రమాణాల ఇంధనానికి తిరిగి వెళ్లడం ప్రభుత్వ విధానం కాదని, మరింత మెరుగైన, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
E20 లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకున్న భారత్
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ నిర్దేశించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని ఐదు సంవత్సరాల ముందుగానే సాధించింది. 2022-23లో సగటు ఇథనాల్ మిశ్రమం సుమారు 12 శాతం ఉండగా, 2023-24లో అది 14.6 శాతానికి, 2024-25లో 19.2 శాతానికి పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (నవంబర్–జూన్ కాలానికి) దేశం 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే E85 ఇంధనం (85 శాతం ఇథనాల్) కేవలం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ఉద్దేశించబడిందని, అది సాధారణ పెట్రోల్ సరఫరాలో భాగం కాదని కేంద్రం స్పష్టం చేసింది.
ఇంజిన్కు నష్టం జరుగుతుందా?
E20 పెట్రోల్ వల్ల ఇంజిన్ దెబ్బతింటుందని, మైలేజీ తగ్గుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నప్పటికీ, వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రభుత్వం పేర్కొంది. ప్రయోగశాల పరీక్షలు, నీతి ఆయోగ్ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, వాస్తవ వినియోగ డేటా ఆధారంగా E20 ఇంధనం ఇంజిన్లకు అసాధారణ నష్టం కలిగించదని నిర్ధారించబడిందని వెల్లడించింది. 2025-26లో 2.84 కోట్లకు పైగా వాహనాలకు సర్వీసింగ్ చేసిన ఒక ప్రముఖ కార్ల తయారీ సంస్థ, ఇథనాల్ కారణంగా ఇంజిన్ వైఫల్యానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని ప్రభుత్వానికి తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు E15+, E20 ఇంధనాన్ని పెద్ద సమస్యలు లేకుండా ఉపయోగిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.
మైలేజీపై కేంద్రం ఏమంది?
ఇంధన సామర్థ్యం అనేది కేవలం పెట్రోల్పై మాత్రమే ఆధారపడదని, డ్రైవింగ్ విధానం, వాహన నిర్వహణ, రహదారి పరిస్థితులు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే E10 కోసం రూపొందించిన పాత వాహనాల్లో E20 వాడితే 3 నుంచి 5 శాతం వరకు మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో E20లో ఉన్న అధిక ఆక్టేన్ విలువ వల్ల వాహన పనితీరు, పికప్, డ్రైవింగ్ అనుభవం మెరుగుపడుతుందని వివరించింది.
రైతులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లాభాలు
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం వల్ల దేశానికి గణనీయమైన ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు లభించాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయినట్లు వెల్లడించింది. అలాగే 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గగా, 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని కేంద్రం పేర్కొంది.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ
E20 పెట్రోల్కు సంబంధించిన సమస్యలు, సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాయి. పెట్రోల్ బంక్లలోని ఫిర్యాదు రిజిస్టర్లు, టోల్ఫ్రీ హెల్ప్లైన్లు, కంపెనీల వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, సోషల్ మీడియా, ప్రత్యేక పోర్టల్ల ద్వారా వినియోగదారులు ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అందిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత విధానాల ప్రకారం పరిశీలించి, నిర్దేశిత గడువులో పరిష్కరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
