Kumbh Mela: ఛీ.. వీళ్లసలు మనుషులేనా? కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి..!
మహా కుంభమేళాలో భక్తి పారవశ్యంలో మహిళలు, అమ్మాయిలు స్నానాలు చేస్తున్నప్పుడు కొంతమంది నీచులు వాటిని వీడియాలు తీసి పోర్న్ గ్రాఫీ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది వాటిని అమ్ముకుంటున్నారు. ఇంకా నీచానికి దిగజారి పోర్న్ సైట్లలో ఉన్న వీడియోలు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఇవి కుంభమేళాలో స్నానాలు చేస్తున్న అమ్మాయిల వీడియోలు అంటూ అమ్ముకుంటున్నారు.

చేసిన పాపాలు పోతాయని చాలా మంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా 55 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే పాపాలు పోతాయని భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే కొంతమంది నీచులు అక్కడ కూడా తామ కామ బుద్ధిని చూపిస్తున్నారు. దాన్ని కూడా ఓ నీచ వ్యాపార మార్గంగా చూస్తున్నారు. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, వాళ్లు బట్టలు మార్చకుంటున్న సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి.. వాటిని అశ్లీల వీడియోల సైట్లలో, టెలిగ్రామ్ ఛానల్స్లో అమ్ముకుంటున్నారు. టెలిగ్రామ్లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్లు సమాచారం.
అందమైన మహిళలు స్నానం చేస్తున్న సమయంలో తడిబట్టల్లో వారిని వీడియోలు తీయడం, అలాగే అక్కడే ఎక్కడో ఓ చోట అమ్మాయిలు బట్టలు మార్చుకుంటేంటే వీడియోలు తీస్తున్నారు కొంతమంది దరిద్రులు. వారి కామ వాంఛ తీర్చుకోవడంతో పాటు వాటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొన్ని అడల్ట్ కంటెంట్ సైట్లతో పాటు, ఓపెన్ బాతింగ్, కుంభమేళా ఉమెన్స్ బాతింగ్ వీడియోస్ అంటూ గ్రూప్లు క్రియేట్చేసి వాటిలో ఈ వీడియోలను అమ్మకానికి పెడుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పాల్గొన్న చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ వీడియోలు అందులో ఉన్నాయని కంగారు పడుతున్నారు.
దీనిపై సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు. డీఐజీ వైభవ్ కృష్ణ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “వీడియోలు పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానెల్స్ను గుర్తించే పనిలో ఉన్నాం. అలాగే వీడియోలు రికార్డ్ చేసి అమ్మకానికి పెట్టిన వారిని పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం” అని తెలిపారు. భక్తి భావంతో వందల మంది చుట్టూ ఉన్నా కూడా మహిళలు పవిత్ర భావనతో త్రివేణి సంగమంలో బహిరంగంగానే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మన చుట్టూ ఉండేవాళ్లు కూడా భక్తి భావంతోనే ఉంటారు కదా అనే నమ్మకంతో వాళ్లు అక్కడే స్నానాలు చేస్తుంటారు. కానీ, కొంతమంది నీచులు వారి నమ్మకాన్ని గంగలో ముంచేస్తూ.. గలీజ్ పనులకు దిగుతున్నారు. అలాంటి వారిని వెంటనే పట్టుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.