National News: పాక్ దారిలోనే చైనా.. దిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ సదస్సుకు డుమ్మా..
పాకిస్తాన్ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'దిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్' సదస్సుకు హాజరుకాలేమంటూ..
పాకిస్తాన్ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘దిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్’ సదస్సుకు హాజరుకాలేమంటూ అగ్రదేశం డుమ్మాకొట్టింది. నవంబర్ 10 (బుధవారం) దిల్లీ వేదికగా జరిగే ఈ కీలక సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించనున్నారు. తాలిబన్ల పాలనలో మగ్గిపోతోన్న అఫ్గాన్ పరిణామాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఇందుకోసం పాక్, చైనాతో పాటు రష్యా, ఇరాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దక్షిణాసియా దేశాలన్నింటికీ భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. చాలా దేశాలు సానుకూలంగా స్పందించి సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే భారత్ విషయంలో మొదటి నుంచి ఒకే వైఖరి అవలంభిస్తోన్న పాక్, చైనా దేశాలు మాత్రం ఈ సదస్సుకు రాలేమని ప్రకటించాయి.
శాంతి భద్రతల పునరుద్ధరణే లక్ష్యంగా.. ఈ ఏడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. అయితే తాలిబన్లతో అఫ్గాన్కే కాదు దక్షిణాసియా దేశాల శాంతికి విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకే భారత ప్రభుత్వం దక్షిణాసియా దేశాలతో ‘దిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్’ సదస్సును ఏర్పాటుచేసింది. అఫ్గాన్లో శాంతి భద్రతల పునరద్ధరణే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అదేవిధంగా ఉగ్రవాదం, రాడికలైజేషన్, మాదక ద్రవ్యాల సరఫరా, దేశ సరిహద్దుల్లో ప్రజల కదలికలు, అమెరికా వదిలిపెట్టిన సైనికాయుధాలు..మొదలగు అంశాలు చర్చకు రానున్నాయి.
అయితే భారత్ విషయంలో మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న పాకిస్తాన్ ఈ సదస్సుకు హాజరుకాలేమని చెప్పింది. తాజాగా చైనా కూడా దాయాది బాటలోనే నడిచింది. సమయాభావం, షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ మీటింగ్కు తమ ప్రతినిధులు రావడం లేదని చైనా తెలిపింది. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా భావిస్తోన్న పాక్ ఈ మీటింగ్కు డుమ్మా కొట్టడం తమకేమి ఆశ్చర్యం కలిగించలేదని, అఫ్గాన్ గురించి ఆ దేశ ఆలోచనను ఇది ప్రస్ఫుటిస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.
Also Read: