Delhi news: పెళ్లి పీటలెక్కాల్సిన యువతి అంతలోనే అనంతలోకాలకు…ఢిల్లీలో ఏం జరిగిందో చూడండి!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన రెండు కుటుంబాలను తలకిందుల చేసింది. నెల క్రితమే నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఊహించని తగిలింది. సరదాగా ఎంజాయ్ చేద్దామని బయటకు వెళ్లిన ఇద్దరిలో ఒకరు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్లు వెళ్లిన ఓ పార్క్లో జరిగిన ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి చేసుకొని ఆనందగా జీవితాన్ని గడపాలనుకున్న వారి ఆశలు అడియాశలైపోయాయి.

చాణక్యపురికి చెందిన సేల్స్ మేనేజర్ ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇరు కుటుంబాల సమక్షంలో గత ఫిబ్రవరిలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. మరికొన్ని నెలల్లో వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోవాల్సిఉంది. అయితే పెళ్లికి ముందు సరదాగా ఆలా బయట తిరిగి వద్దామనుకున్న ప్రియాంక, కాబోయే భర్త నిఖిల్తో కలిసి కాపషేరా హెడా ప్రాంతంలో ఉన్న “ఫన్ అండ్ ఫుడ్ విలేజ్” అనే అమ్యూజ్మెంట్ పార్క్కు వెళ్లింది. కాసేపు ఆ పార్క్ అంతా తిరిగి ..అక్కడే ఉన్న రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తు రోలర్ కోస్టర్ స్టాండ్ విరిగిపోవడంతో..ప్రియాంక దానిపై నుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన నిఖిల్..ప్రియాంకను వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో నిఖిల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కళ్ల ముందే కాబోయే భార్య ప్రాణాలు కోల్పోవడంతో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
పార్క్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిఖిల్ ఆరోపించాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియాంక మృతదేహాన్ని పోస్ట్మార్టం తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి కారణం వాటర్ పార్క్ యాజమాన్యం నిర్లక్ష్యమా లేక రైడ్లో సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
