AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: అత్యాశ అనర్థాలకు మూలం.. సహనమే సౌభాగ్యం.. బంగారు గుడ్డు పెట్టే కోడి కథ

విద్యార్థి రోజూ క్రమం తప్పకుండా చదివితే మంచి ఫలితాలు సాధిస్తాడు. కానీ ఒక్కరోజులోనే అన్నీ నేర్చుకోవాలని ప్రయత్నిస్తే విజయం కష్టమవుతుంది. వ్యాపారంలోనూ చిన్నచిన్న లాభాలతో స్థిరంగా ఎదగడం మంచిది. త్వరగా ధనవంతులు కావాలనే అత్యాశతో తప్పు మార్గాలు ఎంచుకుంటే నష్టమే మిగులుతుంది. ఉద్యోగం, వ్యవసాయం, పెట్టుబడులు ఇలా ఏ రంగంలోనైనా సహనం, క్రమశిక్షణ, సంతృప్తి విజయానికి కీలకం. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పండి..

Moral Story: అత్యాశ అనర్థాలకు మూలం.. సహనమే సౌభాగ్యం.. బంగారు గుడ్డు పెట్టే కోడి కథ
The Golden Egg Story
Srilakshmi C
|

Updated on: Aug 01, 2026 | 6:00 AM

Share

ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు, తన భార్య లక్ష్మమ్మతో కలిసి ఉన్నదాంట్లో సౌఖ్యంగా, ఆనందంగా జీవించేవారు. వారు చాలా నిజాయితీగా, కష్టపడి పనిచేసేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో శ్రమించినా, వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు మాత్రమే సరిపోయేది. అయినప్పటికీ ఉన్నదానితో సంతోషంగా జీవించేవారు. వారి ఇంటి వెనుక చిన్న కోళ్ల గూటి ఉండేది. అందులో కొన్ని కోళ్లు ఉండేవి. ఒకరోజు రామయ్య సంతకు వెళ్లి, ఆరోగ్యంగా కనిపించిన ఒక కొత్త కోడిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు తెల్లవారుజామున కోళ్లకు గింజలు వేయడానికి గూటిలోకి వెళ్లిన రామయ్య ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ కోడి పెట్టిన గుడ్డు సాధారణ గుడ్డు కాదు. అది బంగారం రంగులో మెరుస్తోంది.

‘ఇది నిజంగానే బంగారమా?’ అని అనుమానపడ్డాడు. అతను ఆ గుడ్డును పట్టణంలోని స్వర్ణకారుడి దగ్గరకు తీసుకెళ్లాడు. స్వర్ణకారుడు పరీక్షించి ‘రామయ్యా! ఇది స్వచ్ఛమైన బంగారు గుడ్డు. దీని విలువ చాలా ఎక్కువ’ అన్నాడు. రామయ్యకు చాలా ఆనందమేసింది. ఆ గుడ్డును అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశాడు. మరుసటి రోజు మళ్లీ అదే కోడి ఇంకో బంగారు గుడ్డు పెట్టింది. ఇలా ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెడుతూనే ఉంది. కొద్ది రోజుల్లోనే వారి జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న ఇల్లు పెద్దదైంది. పొలాలు కొనుగోలు చేశారు. మంచి దుస్తులు ధరించారు. గ్రామంలో అందరూ వారిని గౌరవించడం ప్రారంభించారు.

‘రామయ్య అదృష్టవంతుడు. దేవుడు అతనిపై కరుణ చూపించాడు’ అని గ్రామస్తులు చెప్పుకునేవారు. కొంతకాలం వరకు రామయ్య ఎంతో సంతోషంగా ఉండేవాడు. కానీ క్రమంగా అతనిలో అత్యాశ పెరిగింది. ఒకరోజు అతను తనలో తాను ఇలా అనుకున్నాడు.. ఈ కోడి ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెడుతోంది. అంటే దీని కడుపులో ఇంకా ఎన్నో బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ప్రతిరోజూ ఒక్కో గుడ్డు కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఒకేసారి అన్నీ తీసుకుంటే నేను మరింత ధనవంతుడిని అయిపోతాను’. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ ‘అలా చేయకు. ప్రతిరోజూ మనకు ఒక బంగారు గుడ్డు వస్తోంది. ఉన్నదానితో సంతోషపడాలి. అత్యాశ మంచిది కాదు’ అని చెప్పింది.

కానీ రామయ్య ఆమె మాటలను పట్టించుకోలేదు. ధనం మీద మోజు అతని ఆలోచనలను మార్చేసింది. మరుసటి రోజు ఉదయం ఒక పదునైన కత్తి తీసుకుని కోడిని కోసేశాడు. కోడి కడుపును తెరిచి చూశాడు. కానీ… అందులో సాధారణ కోడి అవయవాలు మాత్రమే ఉన్నాయి. ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు. ఆ క్షణంలోనే తన పెద్ద తప్పు అతనికి అర్థమైంది. ‘అయ్యో! నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను! ప్రతిరోజూ నాకు సంపదను ఇస్తున్న కోడినే నా అత్యాశతో చంపేశాను’ అని తల పట్టుకుని ఏడ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కోడి చనిపోయింది. ఇకపై ఒక్క బంగారు గుడ్డు కూడా రాలేదు. కొద్ది నెలల్లోనే అతని డబ్బంతా ఖర్చైపోయింది. మళ్లీ పేదరికం వచ్చింది. తన అత్యాశ వల్లే తాను సంపదను కోల్పోయానని జీవితాంతం బాధపడుతూ గడిపాడు.

నీతి

ఈ కథ మనకు చాలా గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. అత్యాశ అనర్థాలకు మూలం అనే సామెతకు ఈ కథ చక్కని ఉదాహరణ. ఉన్నదానితో సంతృప్తిగా జీవించే వారే నిజమైన సుఖాన్ని పొందుతారు. అత్యాశ వల్ల చేతిలో ఉన్నదీ పోతుంది. అత్యాశ మనిషి ఆలోచనా శక్తిని దెబ్బతీస్తుంది. ఎక్కువ సంపాదించాలనే కోరిక తప్పు కాదు, కానీ అడ్డదారులు లేదా తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరం. సహనం విజయానికి పునాది. చిన్న చిన్న లాభాలు కాలక్రమంలో పెద్ద విజయాలకు దారి తీస్తాయి. ఉన్నదానితో సంతృప్తి చెందడం ఒక గొప్ప గుణం. సంతృప్తి ఉన్నవాడు నిజమైన ధనవంతుడు. పెద్దల లేదా అనుభవం ఉన్నవారి సలహాలను గౌరవించాలి. లక్ష్మమ్మ మాట విని ఉంటే రామయ్య తన సంపదను కోల్పోయేవాడు కాదు. తొందరపాటు నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగిల్చవచ్చు.

Follow Us