మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడానికి మీరు కూడా రోజూ ఉదయాన్నే మెంతి నీళ్లు తాగుతున్నారా? అయితే ఆగండి.. అమృతం లాంటి ఔషధ గుణాలున్న మెంతులు అందరి శరీర తత్వానికీ సరిపడవని మీకు తెలుసా? కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు మెంతులు ఎవరెవరు అస్సలు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయ వంటకాల్లో సువాసన, రుచికోసం పోపు దినుసుగా వాడే మెంతులకు ఆయుర్వేదంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఉదయాన్నే పరగడుపున మెంతి నీళ్లు తాగడం, నానబెట్టిన మెంతులను నమిలి తినడం ఒక ట్రెండ్గా మారింది. వీటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి వంటి కీలక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఆరోగ్యానికి అమృతంలా భావించే మెంతులు అందరికీ సరిపడవని, కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు వీటిని తీసుకుంటే తీవ్రమైన అనర్థాలు ఎదురవుతాయని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ విపుల్ హెచ్చరిస్తున్నారు.
ఎవరెవరు మెంతులకు దూరంగా ఉండాలి?
గర్భిణులు, బాలింతలు
గర్భధారణ సమయంలో మహిళలు మెంతులను రెగ్యులర్ సప్లిమెంట్గా లేదా నానబెట్టిన రూపంలో తీసుకోకూడదు. మెంతులు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే ప్రమాదం ఉంది, ఇది గర్భస్రావానికి దారితీయవచ్చు. అలాగే శిశువులకు పాలిచ్చే తల్లులు కూడా వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
సర్జరీ చేయించుకునేవారు
ఏదైనా శస్త్రచికిత్స జరగడానికి కనీసం రెండు వారాల ముందు మెంతులు తీసుకోవడం పూర్తిగా ఆపేయాలి. మెంతులు రక్తం గడ్డకట్టే ప్రక్రియను మందగింపజేస్తాయి. ఫలితంగా సర్జరీ సమయంలో, ఆ తర్వాత అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు
వార్ఫరిన్, అసిట్రోమ్ వంటి బ్లడ్ థిన్నర్ మందులు వాడుతున్నవారు మెంతులకు దూరంగా ఉండటం మంచిది. మందులతో కలిసి మెంతులు తీసుకున్నప్పుడు రక్తం అతిగా పల్చబడి రక్తస్రావం ముప్పు పెరుగుతుంది.
తీవ్రమైన కడుపు సమస్యలు, ఐబీఎస్ ఉన్నవారు
సాధారణ గ్యాస్ సమస్యలకు మెంతులు ఉపశమనం ఇస్తాయి. కానీ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా అత్యంత సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు మెంతులు క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపు ఉబ్బరం, విరేచనాలు, కడుపు నొప్పి తీవ్రమయ్యే అవకాశం ఉంది.
మధుమేహ బాధితులు – లో షుగర్ ముప్పు
మెంతులు సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అయితే, ఇప్పటికే ఇన్సులిన్ లేదా గ్లిమెపిరైడ్ వంటి మందులు వాడుతున్న డయాబెటిస్ రోగులు రోజూ మెంతులు తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయే ముప్పు ఉంటుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు
థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ మందులు వాడేవారు మెంతులు తీసుకునే విషయంలో సమయపాలన పాటించాలి. థైరాయిడ్ మాత్ర వేసుకోవడానికి, మెంతులు తినడానికి మధ్య కనీసం 2 గంటల సమయం గ్యాప్ ఉండాలి. లేదంటే మెంతుల్లో ఉండే ఫైబర్ థైరాయిడ్ మందుల శోషణను అడ్డుకుంటుంది. ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి ఏ పదార్థాన్నీ మోతాదుకు మించి తీసుకోకూడదని డాక్టర్ విపుల్ స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మెంతులను ఔషధంగా లేదా సప్లిమెంట్గా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
