AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavad Gita: ఈ మూడు తప్పులను వదిలితేనే మనిషికి మోక్షం దొరుకుతుందట..!

శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని అధోగతి పాలు చేసే మూడు ప్రధానమైన దోషాల గురించి వివరించాడు. అవి కామం, క్రోధం, దురాశ. ఈ మూడు గుణాలు మన అంతర్గత శాంతిని కలవరపరుస్తాయి. వీటిని పూర్తిగా విడిచిపెట్టడం ద్వారానే జీవితం సానుకూలమైన మార్గంలో కొనసాగుతుందని భగవద్గీత బోధిస్తుంది.

Bhagavad Gita: ఈ మూడు తప్పులను వదిలితేనే మనిషికి మోక్షం దొరుకుతుందట..!
Bhagavad Gita Teachings
Prashanthi V
|

Updated on: May 19, 2025 | 8:02 PM

Share

శ్రీమద్ భగవద్గీతను కేవలం మత గ్రంథంగా కాదు.. మన జీవన విధానాన్ని మార్గనిర్దేశం చేసే అమూల్య గ్రంథంగా కూడా పరిగణిస్తారు. ఇందులో శ్రీకృష్ణుడు ఇచ్చిన బోధనలు ఈనాటి జీవితానికి కూడా అత్యంత ప్రాముఖ్యంగా వర్తిస్తాయి. గీతలో ఆయన మూడు ముఖ్యమైన దోషాలను పేర్కొన్నారు. ఇవి మన ఆత్మబలాన్ని తగ్గించి.. మనల్ని నరక మార్గంలోకి నడిపించే ప్రమాదం ఉందని చెప్పారు.

భగవద్గీతలో కామం, కోపం, దురాశ అనే మూడు దోషాలు మనిషిని దిగజార్చే ద్వారాలుగా పేర్కొనబడ్డాయి. వీటి గురించి భగవద్గీత శ్లోకం (అధ్యాయం 16, శ్లోకం 21) ఇలా చెబుతుంది

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః

కామః క్రోధస్త లోభస్తస్మాదేతత్రయం త్యజేత్

అంటే ఈ మూడు దోషాలు (కామం, కోపం, దురాశ) నరకానికి తెరవబడే ద్వారాలే. కాబట్టి వీటిని వెంటనే వదిలేయాలి.

కామం

కామం అంటే సాధారణ కోరికలు ఎక్కువై, వాటిని ఎలాగైనా తీర్చుకోవాలనే బలమైన ఆలోచన కలగడం. ఈ కోరిక నెరవేరకపోతే మనసు లోతుల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తి నుంచి మనిషి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. ఎప్పటికీ తీరని కోరికలు మనిషిని స్వార్థంతో నడిపిస్తాయి. స్వార్థం వల్ల ఇతరులకు హాని చేసే దిశగా అడుగులు వేస్తాడు. ఈ విధంగా కామం ఆత్మను కలుషితం చేస్తుంది.

కోపం

కోపం అనేది అంతరంగాన్ని కాల్చే అగ్ని. ఇది మొదట మనలోనే నాశనాన్ని ప్రారంభిస్తుంది. కోపంలో ఉన్న మనిషి సరైన నిర్ణయం తీసుకోలేడు. అతనికి నిజం, తప్పు మధ్య తేడా స్పష్టంగా కనిపించదు. కోపం వల్ల మన మాటల్లో కఠినత్వం, ద్వేషం పెరుగుతుంది. ఇది మన ఆధ్యాత్మిక జీవనంలో క్షీణతకు కారణమవుతుంది.

దురాశ

దురాశతో ఉండే వ్యక్తికి ధనం ఎంత ఉన్నా సరిపోదు. అతనికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఇతరుల కంటే ధనం ఎక్కువగా కావాలని కోరుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ధనం కోసం ధార్మిక పరిమితుల్ని దాటి పోతాడు. ఇది నెమ్మదిగా అతన్ని తప్పుడు మార్గాల్లోకి నడిపిస్తుంది. దురాశ వల్ల అతను పాపానికి లోనవుతాడు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే.. ఈ మూడు దోషాలను పూర్తిగా వదిలినపుడు మాత్రమే మనిషి మోక్షానికి చేరుకోగలడు. కామం, కోపం, దురాశను నియంత్రించడమే ఆత్మరక్షణకు మొదటి అడుగు. వీటిని నియంత్రించడం ద్వారా శాంతిని, లోతైన ఆనందాన్ని పొందవచ్చు.

మన జీవితంలో భగవద్గీత బోధనలు పాటించడమే మన ఆత్మ అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ మూడు దోషాల్ని పూర్తిగా వదిలి, ఆత్మ నియంత్రణతో జీవించాలంటే చక్కటి ఆలోచనలు, మంచి చర్యలు అవసరం. మనం ఈ మార్గంలో నడిచినప్పుడు జీవితం మంచి దిశలో నడుస్తుంది.