AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్షక ఆందోళన ఇక ఖతర్నాక్.. బీజేపీ నేతలే టార్గెట్.. 14న దేశవ్యాప్తంగా ధర్నాలు..ఢిల్లీ దారులన్నీ బంద్!

కర్షక ఆందోళన ఇక ఖతర్నాక్.. బీజేపీ నేతలే టార్గెట్.. 14న  దేశవ్యాప్తంగా ధర్నాలు..ఢిల్లీ దారులన్నీ బంద్!
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 09, 2020 | 6:36 PM

Share

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించిన రైతు సంఘాల నేతలు వాటిని ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి.  ఈ నెల 14న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 12 వరకు దిల్లీ-జైపుర్​, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Dec 2020 06:03 PM (IST)

    అమిత్​ షా నివాసానికి వ్యవసాయ శాఖ మంత్రి

    కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో.. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ సమావేశం కానున్నారు. షా నివాసానికి ఆయన చేరుకున్నారు. కేంద్ర పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయాలపై వారు చర్చించనున్నారు.

  • 09 Dec 2020 05:43 PM (IST)

    విపక్షాల మీడియా సమావేశం..

    1. వ్యవసాయ చట్టాల గురించి రాష్ట్రపతికి వివరించాం: రాహుల్‌గాంధీ
    2. కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం: రాహుల్‌గాంధీ
    3. వణికించే చలిలోనూ రైతులు అహింసా మార్గంలో పోరాడుతున్నారు: రాహుల్​
    4. రైతులు నష్టపోయేలా ఉన్న వ్యవసాయ చట్టాలు తెచ్చారు: రాహుల్‌గాంధీ
    5. రైతులకు దేశమంతా అండగా నిలవాల్సిన సమయమిది: రాహుల్‌గాంధీ
    6. కేంద్రం అప్రజాస్వామికంగా కొత్త చట్టాలు చేసింది: సీతారాం ఏచూరి
  • 09 Dec 2020 05:28 PM (IST)

    కేంద్ర ప్రతిపాదనల తిరస్కరణ, సంచలన నిర్ణయం తీసుకున్న రైతు సంఘాలు

    కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్ర పెద్దలు పంపిన ప్రతిపాదనలకు రైతు సంఘాలు ఏకగ్రీవంగా తిరస్కరించాయి. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు కార్పోరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగా తమ కార్యచరణను ప్రకటించాయి. వాటిలో ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం.

    1. జియో సిమ్ నుంచి మొదలుపెట్టి రిలయన్స్ ఉత్పత్తులు అన్నీ బహిష్కరణ
    2. దేశవ్యాప్తంగా బీజేపీ నేతల ఘెరావ్
    3. ఈ నెల 12న ఢిల్లీ-జైపూర్ రహదారి దిగ్భంధం
    4. 14న దేశవ్యాప్తంగా ధర్నాలు..ఢిల్లీ దారులన్నీ బంద్
    5. రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలు
  • 09 Dec 2020 04:43 PM (IST)

    కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపించిన లేఖలోని కీలక ప్రతిపాదనలు ఏంటంటే..?

    కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు విస్వసనీయ సమాచారం అందుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ విషయంపై సంఘం ప్రతినిధుల మాట్లాడనున్నారు. మూడు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. అయితే… సవరణలకు మాత్రమే కేంద్రం అంగీకరిస్తుంది.

    కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపించిన లేఖలోని కీలక ప్రతిపాదనలు :

    • ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ, ఏపీఎంసీల్లో ఒకే పన్ను విధానం
    • ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్లో మార్పు
    • ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేయటం
    • ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి
    • ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూముల రక్షణ కల్పించేలా నిబంధనలు
    • వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్​డీఎంల అధికారాల సవరణ
    • ఒప్పంద వ్యవసాయంలో సివిల్​ కోర్టును ఆశ్రయించేందుకు వీలు
  • 09 Dec 2020 04:12 PM (IST)

    రైతు సంఘాల మధ్య అభిప్రాయ బేధాలు

    కేంద్ర ప్రతిపాదనలపై రైతు సంఘాలు తర్జన, భర్జన పడుతన్నాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా..మరికొన్ని సానకూలత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సాయంత్రం 5 గంటలకు దీనిపై స్పష్టత రానుంది. రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తోన్న సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు సాయంత్రం ఐదు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు

  • 09 Dec 2020 04:06 PM (IST)

    కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు

    కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు రైతు సంఘాలు తిరస్కరించాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో మరికాసేపట్లో రైతు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడనున్నారు.

  • 09 Dec 2020 03:51 PM (IST)

    అన్నదాతల ఆందోళన, చలికి తట్టుకోలేక రైతు మృతి

    సింఘు సరిహద్దుల్లో 10 రోజులుగా నిరసన చేస్తున్న రైతుల్లో అజయ్ మోరె అనే 32 ఏళ్ళ అన్నదాత గజగజ వణికించే చలికి తట్టుకోలేక మృతి చెందాడు. రెండు వారాలుగా రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. తన ట్రాలీలోనే అజయ్ మోరె మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. హర్యానా లోని సోనీపట్ కు చెందిన ఇతనికి వృధ్ధులైన తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నదాతల ఆందోళన ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు 5 గురు రైతులు మృతి చెందారు.

  • 09 Dec 2020 03:42 PM (IST)

    సాయంత్రంలోగా రైతు సంఘాల కీలక ప్రకటన

    సింఘు సరిహద్దుల్లో రైతు సంఘాల సమావేశం కొనసాగుతోంది. కేంద్ర పంపిన ప్రతిపాదనలపై రైతు సంఘాల నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ పెద్దలు నేటితో సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. మరికాసేపట్లో ప్రభుత్వ పెద్దలు మీడియాకు ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. రైతులు కూడా సాయంత్రంలోగా తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

  • 09 Dec 2020 03:36 PM (IST)

    రైతుల్లో భిన్న స్వరాలు

    రైతు సంఘాల నేతల సమావేశం కొనసాగుతోంది. కేంద్రం పంపిన ప్రతిపాదనలపై వారు చర్చిస్తున్నారు. అయితే అన్నదాతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం పాచిక పారుతోందా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముసాయిదాలో రైతు బిల్లులును తీసుకురావడం వెనుక  కసరత్తును కేంద్రం వివరించింది. అయితే రైతులు కొన్ని డిమాండ్లకు సానుకూలంగానే స్పందిస్తోన్న కేంద్రం..పూర్తి స్థాయిలో బిల్లులను వెనక్కి తీసుకునేందుకు మాత్రం సిద్దంగా లేనట్లు తెలుస్తోంది.

  • 09 Dec 2020 03:23 PM (IST)

    రైతుల‌కు కేంద్రం లేఖ‌

    కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న రైతుల‌కు కేంద్రం నేడు లేఖ రాసింది.  క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పించేందుకు హామీ ఇస్తున్న‌ట్లు ఆ లేఖ‌లో ప్ర‌భుత్వం వెల్లడించింది. కావాలంటే లిఖిత‌పూర్వంగా కూడా తాము హామీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌ల‌ను విర‌మిస్తామ‌ని అన్నదాతలు చెబుతున్నారు. అయితే గ‌త కొన్ని రోజులుగా ప్రభుత్వం, రైతుల మ‌ధ్య జ‌రిగిన‌ ప‌లు విడతలుగా జరిగిన చ‌ర్చ‌లు  విఫ‌లం అయ్యాయి.  సింఘూ స‌రిహ‌ద్దు వ‌ద్ద ధ‌ర్నా చేస్తున్న రైతుల‌కు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం లేఖ‌ను పంపింది. ఆ లేఖ‌ను అందుకున్న రైతులు దానిపై చ‌ర్చించ‌నున్న‌ట్లు సమాచారం.  కేంద్ర ప్ర‌భుత్వం పంపిన ముసాయిదాపై తాము నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు బీకేయూ  అధ్య‌క్షుడు మ‌న్‌జీత్ సింగ్ వివరించారు

  • 09 Dec 2020 03:18 PM (IST)

    రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపిన కేంద్రం

    చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘలకు కేంద్రం పంపిన విషయం తెలిసిందే.  ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్రం చెబుతోంది. ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలకు కేంద్రం సుముఖంగా ఉంది. ఏపీఎంసీల్లో ఒకే ట్యాక్స్ ఉంటుందన్న సవరణకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రైవేటు కొనుగోలుదారులను రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసేలా సవరణ రూపొందించనుంది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామని కేంద్రం చెబుతోంది.

  • 09 Dec 2020 02:59 PM (IST)

    రైతుల ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ క్రికెటర్‌

    కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్త ఆందోళనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా నిర్వహించారకు. ఇప్పటికే రైతులకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.  పలువురు క్రీడా ప్రముఖులు, సెలబ్రిటీలు రైతుల పక్షాన నిలిచారు.  తాజాగా  క్రికెటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ రైతులకు మద్దతివ్వడమేగాక.. స్వయంగా వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. తన సోదరుడు హర్వీందర్‌ సింగ్‌, మరో ముగ్గురు మిత్రులతో కలిసి గత సోమవారం సాయంత్రం సింఘు సరిహద్దుకు వెళ్లిన మన్‌దీప్‌.. మంగళవారం సాయంత్రం వరకు అక్కడే అన్నదాతలతో కలిసి నిరసన తెలిపారు.

  • 09 Dec 2020 02:20 PM (IST)

    ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలిః కుమార స్వామి

    కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై జేడీఎస్ నేత కుమార స్వామి స్పందించారు. రైతుల మేలు కోసం ప్రవేశపెట్టిన చట్టాలను కాంగ్రెస్ విమర్శిస్తోందని, వాటికి ప్రత్యామ్నాయాలను మాత్రం చూపడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. మూడు వ్యవసాయ బిల్లుల్లోని కొన్ని అంశాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని.. తాము సూచించిన వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

  • 09 Dec 2020 01:36 PM (IST)

    రైతుల దుస్థితికి ప్రతిపక్షాలే కారణంః శివరాజ్‌సింగ్

    రైతు సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ కొత్త చట్టాలను తీసుకువచ్చారన్నారు. విపక్షాల పాలనలో రైతులకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. రైతులను దివాళా తీయించినవారే.. నేడు రాష్ట్రపతిని కలవడానికి సమాయత్తమవుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాలు రైతులకు క్షమాపణలు చెప్పాలని, రైతుల దుస్థితికి ప్రతిపక్షాలే కారణమని ఆయన మండిపడ్డారు. రైతులందరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారని, బంద్‌ను నిర్వీర్యం చేసిన మధ్యప్రదేశ్ రైతులకు శివరాజ్ ధన్యవాదాలు ప్రకటించారు.

  • 09 Dec 2020 01:19 PM (IST)

    రైతు ఆందోళనలో పాల్గొన్న భారత క్రికెటర్

    వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్‌, హర్యానా రైతులు 14 రోజులుగా చేస్తున్న ఆందోళ‌న‌కు మరో ఇండియ‌న్ క్రికెట‌ర్ మద్దతు పలికాడు. అన్నదాతలకు అండగా చాలా మంది స్పోర్ట్స్ స్టార్లు నిలుస్తుండగా.. పంజాబ్ రంజీ టీమ్ కెప్టెన్‌, ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ ప్లేయ‌ర్ అయిన మ‌ణ్‌దీప్ సింగ్ మాత్రం.. నేరుగా వెళ్లి వాళ్ల‌తో క‌లిసి ఆందోళ‌నలో పాల్గొన్నాడు. వ‌ణికించే చ‌లిలో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌కు త‌న మ‌ద్ద‌తు తెల‌పాల‌న్న ఉద్దేశంతోనే తాను వెళ్లిన‌ట్లు మ‌ణ్‌దీప్ చెప్పాడు. సింఘు స‌రిహ‌ద్దులో ఆందోళ‌న చేస్తున్న రైతుల ద‌గ్గ‌ర‌కు మ‌ణ్‌దీప్ వెళ్లి వాళ్ల‌తో క‌లిసి నిర‌స‌న‌లో కూర్చున్నాడు.

  • 09 Dec 2020 01:07 PM (IST)

    మోదీ మొండిపట్టు వీడాలిః దిగ్విజయ్

    వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోదీ మొండి పట్టుదల వీడాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 14 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ఆయన చేశారు. ఈ చట్టాల విషయంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.

  • 09 Dec 2020 12:46 PM (IST)

    ప్రభుత్వ హామీ లిఖితపూర్వకంగా ఉండాలంటున్న రైతు సంఘాలు

    ప్రభుత్వం ఎలాంటి హామీ ఇచ్చినా… అది లిఖితపూర్వకంగా ఉండాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, నూతన చట్టాలను సవరించడం కాకుండా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇదే విషయంపై రైతు సంఘం నాయకుడు హన్నన్ మొహల్లా మాట్లాడుతూ… ‘‘ఈ రోజు లిఖితపూర్వకంగా ఏదో పంపుతామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాత పూర్వకంగా పంపితే పరిశీలిస్తామని మేమూ చెప్పాం. ప్రభుత్వం తాజాగా పంపిన కొత్త ప్రతిపాదనలపై విస్తృత కమిటీ చర్చిస్తుంది. సవరణల మీద మాత్రం లిఖిత పూర్వకంగా ఉండాలి. బిల్లునే రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ హన్నన్ అన్నారు.

  • 09 Dec 2020 12:30 PM (IST)

    ప్రారంభమైన రైతు సంఘాల నేతల సమావేశం

    రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్ర ప్రభుత్వం సుమఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబందించిన కొత్త ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతల సమావేశమయ్యారు. కేంద్రం పంపిన ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. వ్యవసయ చట్టాల్లో రైతులు లెవనెత్తుతున్న అభ్యంతరాల పరిష్కారానికి పలు ప్రతిపాదనలు చేసింది కేంద్రం. ఈ సాయంత్రంలోగా కేంద్రం ప్రతిపాదనలపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి.

  • 09 Dec 2020 11:57 AM (IST)

    వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం సుముఖత

    నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలపై కేంద్రం కొత్త ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రభుత్వ – ప్రైవేటు మార్కెట్లలో ఒకే ట్యాక్స్ ఉంటుందన్న సవరణకు కేంద్రం సానుకులంగా ఉన్నట్లు తెలిపింది.

    ఇక, ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసేలా సవరణ చేస్తామని తెలిపిన కేంద్రం.. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామని వెల్లడించింది. వ్యాపారులు-రైతుల కాంట్రాక్ట్ వ్యవసాయ వివాద పరిష్కారంలో సబ్ కలెక్టర్ అధికారాల సవరణకు సైతం కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా సవరణ తీసుకురానుంది. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ తీసుకువస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

    రైతుకు కనీస మద్ధతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని తెలిపిన కేంద్రం.. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

  • 09 Dec 2020 11:42 AM (IST)

    రాష్ట్రపతితో భేటీ కానున్న అఖిలపక్షనేతలు

    వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనల నేపథ్యంలో విపక్ష బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలువనుంది. సాయంత్రం 5 గంటలకు ఐదుగురు విపక్ష నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, డీఎంకే ప్రతినిధి కోవింద్‌తో సమావేశం కానున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరనున్నారు.

  • 09 Dec 2020 11:39 AM (IST)

    5 సవరణలకు కేంద్రం సుముఖత..?

    కొత్త వ్యవసాయ చట్టాల్లో ఐదు సవరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఏపీఎంసీలను బంద్‌ చేయబోమని, రైతులు-వ్యాపారుల మధ్య ఒప్పంద వివాదాలను పరిష్కరించే ఎస్‌డీఎం అధికారాలను అన్నదాతల సూచనల మేరకు సవరిస్తామని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు లిఖితపూర్వక హామీ ఇస్తామని, విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై రైతులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, పంజాబ్‌లో పంట కోతల తర్వాత వెలువడే వ్యర్థాల దహనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అమిత్‌ షా రైతు నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే అన్నదాతలు ఈ సవరణలతో సంతృప్తి చెందే అవకాశాలు కనిపించడం లేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని అన్నదాతలు చెబుతున్నారు.

  • 09 Dec 2020 11:28 AM (IST)

    14వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు

    14వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు

    14వ రోజూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు కర్షకులు. సింఘు, టిక్రి, ఘాజిపూర్‌, నోయిడా సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సింఘు సరిహద్దులో రైతు సంఘాలు సమావేశమవనున్నాయి. కేంద్రం ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్‌ భేటీ అవుతుంది. రైతు ఆందోళనలు సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం.

  • 09 Dec 2020 11:26 AM (IST)

    పట్టు వీడని రైతులు.. మెట్టు దిగని కేంద్రం..

    రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. వ్యవసాయ చట్టాలపై పట్టు వీడటం లేదు రైతులు. మెట్టు దిగడం లేదు కేంద్రం. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డైరెక్ట్‌గా రంగంలోకి దిగినా చర్చలు ఫలించలేదు. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటున్నారు అన్నదాతలు. ఇటు కేంద్రం కూడా సాగు చట్టాలు రద్దు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఐతే సవరణలకు మాత్రం ఒకే చెప్పారు షా. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను అన్నదాతలకు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు రైతు నాయకులు. ఈ నేపథ్యంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇవాళ జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.

  • 09 Dec 2020 11:21 AM (IST)

    ఫలించని అమిత్‌షా చర్చలు

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు మంగళవారం (డిసెంబర్ 8) రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో జరుగుతున్న ఈ భేటీకి 25 రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు చట్టాల మీద కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకే అమిత్ షా వారితో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కానీ, నేడు వాస్తవంగా కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అమిత్ షాతో రైతుల సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా హాజరయ్యారు. అమిత్ షాతో చర్చల తర్వాత వారు ఢిల్లీ సరిహద్దుల్లోని సింగ్ బోర్డర్‌లో రైతులతో చర్చించి ఆందోళన మీద ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం తెచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాయి. ఔనా? కాదా? ఒక్కటే మాట చెప్పాలని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

  • 09 Dec 2020 11:13 AM (IST)

    నీతి ఆయోగ్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

    రైతులకు మద్దతు తెలుపుతున్న ప్రతిపక్షాలు ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలవనున్నాయి. కేంద్రం తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేలా మోదీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వరాజ్ మేగజీన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ కాంత్ మాట్లాడుతూ దేశంలో ‘టూ మచ్ ప్రజాస్వామ్యం’ వల్ల సంస్కరణలు తీసుకురావడం కష్టం అవుతుందని వ్యాఖ్యానించారు.

  • 09 Dec 2020 11:12 AM (IST)

    రైతులకు మద్దతుగా దేశ వ్యాప్త ఆందోళనలు

    రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారత్ బంద్ పెద్ద ఎత్తున నిర్వహించారు. అధికార పార్టీ, ప్రభుత్వాలు కూడా మద్దతు పలకడంతో భారీ ఎత్తున రైతులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా జాతీయ రహదారులపై ధర్నాలు నిర్వహించి, రైతులకు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. వెంటనే కేంద్రం తెచ్చిన మూడురైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Published On - Dec 09,2020 6:22 PM