Tiger Forest: పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. అందుకే పులి సంరక్షణ కేంద్రాలు మూసివేత.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
Tiger Forest: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరోసారి తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అఖిల భారత పులుల అంచనా (AITE-2026) ప్రాథమిక సర్వేలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో మొత్తం 42 పులుల ఆనవాళ్లు నమోదయ్యాయి. వీటిలో 18 ఆడ పులులు..

Tiger Forest: మధ్యప్రదేశ్లో అత్యంత సుందరమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా పేరుగాంచిన సాత్పురా టైగర్ రిజర్వ్లో వార్షిక వర్షాకాల నియమ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో జరిగే సాంప్రదాయ ముగింపు ప్రక్రియలో భాగంగా, జులై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు సాత్పురా కోర్ జోన్ (ప్రధాన అటవీ ప్రాంతం) లో పర్యాటకుల జంగిల్ సఫారీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
వర్షాల కారణంగా అడవిలోని లోపలి దారులు బురదమయంగా మారి వాహనాలు వెళ్లడానికి వీలుండదు. అంతేకాకుండా, ఈ సమయం వన్యప్రాణుల పునరుత్పత్తి (Breeding Season) కాలం కావడంతో జంతువుల స్వేచ్ఛకు, భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి అక్టోబర్ 1 నుండి యథావిధిగా కోర్ జోన్ సఫారీలు ప్రారంభమవుతాయి. అయితే పర్యాటకుల కోసం అడవి వెలుపల ఉండే బఫర్ జోన్ (Buffer Zone) సఫారీలు మాత్రం ఈ వర్షాకాలంలోనూ అందుబాటులో ఉంటాయి.
సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని..
రుతుపవనాల రాక, వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి సంవత్సరం మాదిరిగానే దేశంలోని చాలా పులి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, అభయారణ్యాలలో జంగిల్ సఫారీలను మూడున్నర నెలల పాటు పర్యాటకుల కోసం మూసివేస్తారు. ప్రతి సంవత్సరం, రుతుపవనాలకు ముందు పులి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, అభయారణ్యాలను మూసివేస్తారని ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఫోర్స్ చీఫ్ అరుణ్ పాండే అన్నారు.
రెండు ప్రధాన కారణాలు:
అటవీ శాఖ ఉన్నతాధికారుల ప్రకారం, ఈ నిషేధం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో అడవుల్లోని కంకర రోడ్లు, సఫారీ మార్గాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల వల్ల నదులు, వాగులు ఉప్పొంగి రోడ్లు మునిగిపోతాయి. దీంతో ప్రయాణం అత్యంత కష్టంగా, ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలం వన్యప్రాణులకు అత్యంత సున్నితమైనది. ఈ కాలం చాలా వన్యప్రాణులకు సంతానోత్పత్తికి, పిల్లలను పెంచడానికి అనువైన సమయం. ఈ సమయంలో మానవ జోక్యాన్ని నివారించడం ద్వారా వన్యప్రాణులకు ప్రశాంతమైన, సహజమైన వాతావరణం లభిస్తుంది.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరోసారి తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అఖిల భారత పులుల అంచనా (AITE-2026) ప్రాథమిక సర్వేలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో మొత్తం 42 పులుల ఆనవాళ్లు నమోదయ్యాయి. వీటిలో 18 ఆడ పులులు, 14 మగ పులులు, 2 సబ్ అడల్ట్ పులులు, 8 పులి పిల్లలు (కబ్స్) ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. దీంతో తెలంగాణలో పులుల సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పులుల సంరక్షణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను కూడా మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




