మున్సిపాలిటీల్లో మోడ్రన్ టాయిలెట్స్, బాత్రూంలు
నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ వాష్ రూమ్లు, కమ్యూనిటీ టాయ్లెట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం.
రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని భావించిన తెలంగాణ సర్కార్ ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున స్మార్ట్ వాష్ రూమ్లు, కమ్యూనిటీ టాయ్లెట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 15 నాటికి 4,696 స్మార్ట్ వాష్రూమ్లు, పబ్లిక్ టాయ్లెట్లు, మహిళల టాయ్లెట్లు, కమ్యూనిటీ టాయ్లెట్ల నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్మించబోతోంది. వీటి నిర్మాణానికి ఎస్ఎ్సఆర్లను ఖరారు చేయాలని జిల్లాల కలెక్టర్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు వీటి నిర్మాణానికి మున్సిపల్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. స్థానిక పరిస్థితులు, జనాభా ఆధారంగా నిర్మాణాలు పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్మార్ట్ వాష్ రూమ్లు, టాయ్లెట్ల నిర్మాణానికి 23 రకాల డిజైన్లను గుర్తించింది. ఇందులో అయా ప్రాంతాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మలమూత్ర విసర్జనను నిషేధించింది. దీంతో ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.