లాక్డౌన్ ఎఫెక్ట్: మెరుగైన ‘గంగమ్మ’ ఆరోగ్యం..!
కరోనావైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతితో అవినాభావంగా ముడివడి
కరోనావైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతితో అవినాభావంగా ముడివడి ఉన్న గంగానది స్వచ్ఛత మరింత పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం నిత్యావసరాలు తప్ప ఇతర పరిశ్రమలు నడవకపోవడంతో నదీలోకి వ్యర్థాలు చేరడం బాగా తగ్గిందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారితో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
కాగా.. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం ప్రకారం చాలా పర్యవేక్షణ ప్రదేశాల్లో స్నానం చేసేందుకు గంగా నది అనుకూలంగా ఉంది. నదికి 36 చోట్ల పర్యవేక్షణ విభాగాలు ఉండగా 27 ప్రాంతాల్లో నీరు స్వచ్ఛంగా ఉంది. జలచరాలు సంచరించేందుకు, జీవించేందుకు యోగ్యంగా మారింది. నీటిలో కరిగిన ప్రాణవాయువు (లీటరుకు 6 మి.గ్రా కన్నా ఎక్కువ), జీవరసాయన ప్రాణవాయువు (లీటరుకు 2 మి.గ్రా. కన్నా తక్కువ), మొత్తం కోలిఫామ్ స్థాయిలు (100 మి.లీ.కు 5000), పీహెచ్ (6.5-8.5) పరామితులను అనుసరించి నదుల ఆరోగ్యాన్ని కొలుస్తారు. గంగా ఉపనదులైన హిందో, యమున (జమున) నదుల్లోనూ స్వచ్ఛత పెరిగింది.