న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో భగ్గుమన్న స్థానికులు.. ఏం చేశారంటే
రాజస్థాన్ అట్టుడుకుతోంది.జోధ్పూర్లోని ఖేరపా ప్రాంతంలో కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గ్యాంగ్రేప్ నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు, నిందితుల నుంచి ఎదురైన నిరంతర బెదిరింపులు జోధ్పూర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అసలు ఆ ఇద్దరు మహిళల ఆత్మహత్యలకు కారణమేంటో.. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాజస్థాన్లోని జోద్పూర్లో ఇద్దరూ అక్కా, చెల్లెల్లు నివసిస్తున్నారు. అయితే గత మార్చి 20వ తేదీన కొందరి వ్యక్తుల వేధింపులు భరించలేక పెద్దక్క ఆత్మహత్య చేసుకుంది. ఇది జరిగిన నెల రోజులకే అంటే ఈ శుక్రవారం ఇద్దరు పిల్లల తల్లి అయిన చిన్న చెల్లెలు (బాధితురాలు) గ్రామంలోని ఒక నీటి ట్యాంక్ ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తనపై, తన పెద్దక్కపై లైంగిక దాడికి ఒడిగట్టి, బ్లాక్మెయిల్ చేస్తున్న ఎనిమిది మంది నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరసనగా ఆమె ఈ ఘోరానికి ఒడిగట్టింది.
ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినా దక్కని న్యాయం
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 11న చిన్న చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఎనిమిది మందిపై గ్యాంగ్రేప్, బ్లాక్మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసింది. తన పెద్దక్కకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించి, వాటిని చూపిస్తూ నిందితులు గత కొన్నేళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తూ, డబ్బులు వసూలు చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
పెద్దక్క ఆత్మహత్య తర్వాత, నిందితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ చిన్న చెల్లెలిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ-మిత్ర (e-Mitra) కియోస్క్ నిర్వాహకుడిగా పనిచేసే ప్రధాన నిందితుడు తనను హోటళ్లు, నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, మరొక నిందితుడు కూడా తన ఇంట్లోనే లైంగిక దాడికి ఒడిగట్టాడని ఆమె ఆరోపించింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదై నెల రోజులు దాటినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి ట్యాంక్ పైనే ఆత్మహత్యాయత్నం
న్యాయం కావాలంటూ శుక్రవారం ఉదయం బాధితురాలు గ్రామంలోని నీటి ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగింది. స్థానికులు సమాచారం అందించడంతో సీనియర్ పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు ట్యాంక్ పైకి ఎక్కుతుండగా ఆమె పురుగుల మందు తాగేసింది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి, ఆపై జోధ్పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
పోలీసుల వివరణ
ఈ ఘటనపై జోధ్పూర్ రూరల్ ఎస్పీ (SP) పి.డి. నిత్య స్పందిస్తూ.. పెద్దక్క చనిపోయినప్పుడు కేసు నమోదైందని, అయితే అందులో అత్యాచారం ఆరోపణలు లేవని తెలిపారు. ఏప్రిల్ 11న రెండో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, విచారణ కోసం ఒక సీనియర్ అధికారిని నియమించాం, దర్యాప్తు కొనసాగుతోంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం తానే స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
రోడ్డెక్కిన రాజ్పుత్ సంఘాలు
ఈ ఘటనతో జోధ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్పుత్ కమ్యూనిటీ సభ్యులు బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తూ ఎండిఎమ్ (MDM) ఆసుపత్రి వెలుపల భారీ ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కమ్యూనిటీ ప్రెసిడెంట్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ.. తనకు న్యాయం జరగకపోతే ప్రాణాలు తీసుకుంటానని బాధితురాలు ముందే పోలీసులకు లిఖితపూర్వకంగా హెచ్చరించిందని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, తమకు పోలీసుల రక్షణ ఉందంటూ నిందితులు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా బాధితురాలిని బెదిరించారని ఆయన ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
