ముగిసిన డీజీపీ టూర్..
ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన ముగిసింది. ఆదివారం డీజీపీ హైదరాబాద్కు తిరిగి బయల్దేరారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు స్థానిక పోలీసులతో డీజీపీ మహేందర్రెడ్డి విస్తృతంగా చర్చించి వారికి మార్గనిర్దేశం చేశారు...
ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన ముగిసింది. ఆదివారం డీజీపీ హైదరాబాద్కు తిరిగి బయల్దేరారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు స్థానిక పోలీసులతో డీజీపీ మహేందర్రెడ్డి విస్తృతంగా చర్చించి వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 2న ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన డీజీపీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉన్నారు. మావోయిస్టుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
హైదరాబాద్ నుంచి నేరుగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణికి చేరుకున్న డీజీపీ.. ఆ రాత్రి తిర్యాణి పోలీసు స్టేషన్ను డీజీపీ సందర్శించారు. మావోయిస్టుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తిర్యాణి పోలీసు స్టేషన్ సిబ్బందికి డీజీపీ డైరెక్షన్ ఇచ్చారు. సెప్టెంబర్ 2న ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ర్ట సరిహద్దుల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసులకు పలు సూచనలు చేశారు. శనివారం కూడా జిల్లా స్థాయి పోలీసు అధికారులతో మారమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై చర్చించారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ చర్చించి దిశానిర్దేశం చేశారు.
రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ బృందాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ల నుంచి 11 మంది సభ్యులతో కూడిన బృందం మార్చిలో వచ్చినట్లు సమాచారం. తిర్యాణి మండలం మంగి, పంగిడి అటవీ ప్రాంతంలో రెండుసార్లు పోలీసులకు ఎదురుపడిన భాస్కర్ బృందం త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.
ఘటనాస్థలం నుంచి భాస్కర్ డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మావోయిస్టులకు సహకరిస్తున్న పలువురి పేర్లను బయటపెట్టి వారికి హెచ్చరికలు సైతం జారీచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు డీజీపీ రెండు రోజులుగా జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.