ఏపీ: ఆ ఒక్క జిల్లాలోనే లక్షకు చేరువైన కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అక్కడ మొత్తం...
Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతూ వస్తున్నాయి. అటు ఏపీ ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరుకుంది. ఇందులో 55,282 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,941 మంది వైరస్ కారణంగా మరణించారు. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు క్రమక్రమంగా పెరుగుతుండటం ప్రజలకు ఊరటను ఇచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,51,791 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. (ఏపీ: పాఠశాలలో పరేషాన్.. 20 మంది విద్యార్థులకు కరోనా..)
ఇదిలా ఉంటే రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు 99,959కు చేరుకోగా.. నిన్న మరో ఐదుగురు మృతి చెందటం.. మొత్తం మరణాల సంఖ్య 537కి చేరింది. ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు భారీగా నమోదైనా.. ప్రస్తుతం 9243 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. సుమారు 90 శాతం మంది కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. (ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక..)
కాగా, కోవిడ్ పాజిటివ్ కేసులు లక్షకు చేరువ అవుతుండటంతో తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పందించారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో పాజిటివిటీ రేట్ 13 శాతమే ఉందని.. ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్లలో రికవరీ రేటు మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. (దుర్గ గుడి ఫ్లైఓవర్కు మళ్లీ ముహూర్తం ఖరారు.!)