ఆడ నీవు..ఈడ నేను! టూర్లలో ‘చంద్రులు’ బిజీ బిజీ
దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటనలపైనే దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనలు, నేతల భేటీలతో బిజీగా ఉన్నారు. తాజాగా, ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఏపీలో ఎన్నికల అనంతర […]
దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటనలపైనే దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనలు, నేతల భేటీలతో బిజీగా ఉన్నారు. తాజాగా, ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పు, ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు, ఐదు దశల్లో ఎన్నికల ట్రెండ్ ఎలా ఉంది తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిపై ఇరువురు నేతలకు వచ్చిన నివేదికలపై పరస్పరం చర్చించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, తదుపరి భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. నిన్న సాయంత్రమే రాహుల్తో చంద్రబాబు భేటీ కావాలని భావించినా… ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధ, గురువారాల్లో పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఝర్గ్రామ్, హల్దియాలో జరిగే సభలకు హాజరవుతారు. గురువారం ఖరగ్పూర్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం మమతా బెనర్జీతో కలిసి పాల్గొంటారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్తో తాజాగా భేటీ అయిన సంగతి తెలిసిందే. డీఎంకే నేత స్టాలిన్తో కూడా బేటీ జరగనుంది. అయితే ఈ బేటీపై కొంత సస్పెన్స్ నెలకొంది. అటు ఐదు విడతల లోక్సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ టూర్స్లో జోరు పెంచారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో టూర్ అనంతరం ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించవచ్చునని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఓసారి ఢిల్లీ టూర్ కూడా చేపడుతారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్.. కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది బెంగాల్ సీఎం మమతా, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడలతో ఆయన భేటీ అయి చర్చించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటుండటంతో మరోసారి ఫెడరల్ ఫ్రంట్ టూర్స్కు శ్రీకారం చుట్టబోతున్నారు.