కరోనా చికిత్సకు రూ. 5 లక్షల పర్సనల్ లోన్.. ఏయే బ్యాంకులు ఇస్తున్నాయి.? ఎలా పొందాలంటే.!

SBI Covid Loan: కరోనా సంక్షోభంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కలిసి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కరోనా చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల..

కరోనా చికిత్సకు రూ. 5 లక్షల పర్సనల్ లోన్.. ఏయే బ్యాంకులు ఇస్తున్నాయి.? ఎలా పొందాలంటే.!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 02, 2021 | 7:30 PM

కరోనా సంక్షోభంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కలిసి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కరోనా చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల పర్సనల్ లోన్స్ ఇవ్వనున్నాయి. ఈ రుణాల కాలపరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. తమకు లేదా తమ కుటుంబసభ్యులలో ఎవరికైనా కరోనా సోకితే వారి చికిత్స నిమిత్తం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలిపాయి. ఎస్‌బీఐ చీఫ్ దినేష్ ఖారా, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్ ఆదివారం జరిగిన ఓ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కరోనా స్పెషల్ పర్సనల్ లోన్‌కు ఎస్‌బీఐ 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేయనుందని.. ఇతర బ్యాంకులు వారి వారి పరిమితులకు లోబడి వడ్డీరేట్లను వసూలు చేస్తారని ఎస్బీఐ చీఫ్ దినేష్ ఖారా అన్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యక్తిగత రుణాన్ని ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డు ఆమోదించిందని స్పష్టం చేశారు. కనీసం రూ. 25 వేల నుంచి గరిష్టం రూ. 5 లక్షల వరకు ఈ లోన్ ద్వారా తీసుకోవచ్చునని.. ఉద్యోగం చేస్తున్నవారికి, చేయనివారికి కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు…

ఇలాంటి రుణాల కోసం దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే తీసుకుంటారని బ్యాంకింగ్ నిపుణుడు అశ్వని రానా తెలిపారు. ఈ సౌకర్యం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదని.. కాబట్టి ఎవరైనా ఈ రుణం తీసుకోవాలనుకుంటే, దీని కోసం వారు బ్యాంకు శాఖకు వెళ్లి సంప్రదించాలన్నారు.

ఆర్బీఐ 50 వేల కోట్ల ప్రత్యేక ఫైనాన్సింగ్..

గత నెల నుంచి ఇలాంటి రుణాలు పంపిణీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రోత్సహిస్తోంది. అటువంటి రుణాన్ని ప్రాధాన్యత రంగ రుణాల స్థితిగా పరిగణించాలని, దాని కోసం 50 వేల కోట్ల వరకు నిధులు సమకూర్చాలని ఆర్బీఐ పిఎస్‌బికి తెలిపింది. ఇందులో నాబార్డ్‌కు 25 వేల కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంకులకు 10 వేల కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకులకు 15,000 కోట్లు ప్రకటించారు.