ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 14 నుంచి ఆరు, ఏడో తరగతి విద్యార్ధులకు తరగతులు.. పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతులు కూడా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు...
6th and 7th Classes : ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. కరోనా పాజిటివ్ కేసులు సైతం రోజు రోజుకు తగ్గుతుండటంతో జనజీవనం గాడిలో పడుతోంది. దీంతో నెమ్మదిగా పాఠశాలలు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఏపీలోని 6,7 తరగతుల విద్యార్థులను ఆన్లైన్ తరగతుల నుంచి తరగతి గదికి తీసుకురావాలని చూస్తోంది ప్రభుత్వం.
డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతులు కూడా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటంతో క్రమంగా హాజరు శాతం పెరుగుతోందని అన్నారు. పాఠశాలలు ప్రారంభం నుంచి 40-50 శాతం మధ్య నడుస్తున్న హాజరు… క్రమేణా 60 శాతం చేరుకుంటోందని వెల్లడించారు. రోజూ 50శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.
పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ విషయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.