చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! సామాజిక గుర్తింపు కోసం లంక శరణార్థుల సుదీర్ఘ పోరాటం
చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! వినడానికి వింతగా ఉన్నా ఇది 40 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశం! సామాజిక గుర్తింపు కోసం శ్రీలంక..
చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! వినడానికి వింతగా ఉన్నా ఇది 40 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశం! సామాజిక గుర్తింపు కోసం శ్రీలంక శరణార్థుల సుదీర్ఘ పోరాటం! చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన శ్రీలంక శరణార్థులకు కుల ధృవీకరణ పత్రాలు దక్కక, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. మా ఓట్లు కావాలి..సమస్యలు మాత్రం పట్టవా? అంటూ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. అసలు మేము ఎందుకు వేయాలి ఓటు? అని నిలదీస్తున్నారు.
కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వని మీకు.. ఓటు ఎందుకు వేయాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తాం అంటే తేల్చిచెబుతున్నారు చిత్తూరు జిల్లాలో శ్రీలంక శరణార్థులు! ఓటర్లుగా తప్ప..మమ్మల్ని మనుషులుగా గుర్తించరా? ఇక్కడే పుట్టి పెరిగి డిగ్రీలు చదువుకున్న తమకు..సామాజిక గుర్తింపు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నిస్తున్నారు ఈ యువతీ యువకులు!
చిత్తూరుజిల్లా గంగవరానికి నలభై ఏళ్ల క్రితం శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన కుటుంబాల ఆవేదన ఇది! నిజానికి వీళ్లంతా భారతీయులే! బ్రిటీష్ పాలనలో ఉపాధి కోసం శ్రీలంకకు వెళ్లి..1983లో శరణార్థులుగా చిత్తూరు జిల్లాకు వచ్చి.. అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిలో 250 మందికిపైగా గంగవరం శ్రీలంకకాలనీలో స్థిరపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా సామాజిక గుర్తింపు కోసం పోరాడుతున్నారు.
క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి వీళ్లది. గంగవరం శ్రీలంక కాలనీలో 90 మందికిపైగానే యువతీ యువకులకు డిగ్రీ పట్టాలున్నా..కుల ధృవీకరణ పత్రాలు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ ఓట్లు వేయమని హెచ్చరిస్తున్నారు. నలభై ఏళ్ల తమ పోరాటాన్ని ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఈ యువతీ యువకులు!
శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు తమిళనాడు, కేరళ, ఏపీలోని ఇతర జిల్లాల్లో సామాజిక గుర్తింపు లభించిందనీ..గంగవరం మండలంలోనే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. నలభై ఏళ్లుగా ఓటర్లుగానే మిగిలిపోయిన తమకు.. సామాజిక గుర్తింపునిచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని శ్రీలంక శరణార్థి కుటుంబాలు కోరుతున్నాయి.