Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!

రామాయణ ఇతిహాసంలో రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడి గురించి అందరికీ తెలిసిన విషయం ఒక్కటే. అతి నిద్ర. ఏడాదిలో 6 నెలల పాటు గాఢ నిద్రలో ఉంటాడని చెప్పుకుంటాం.

కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
Kumbhakarna
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Nov 19, 2024 | 8:03 PM

పురాణేతిహాసాలు, చరిత్రపై నేతలు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి వివాదం సృష్టిస్తుంటాయి. ఒక్కోసారి వైరల్‌గా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకునే తీరు ఆసక్తి రేకెత్తిస్తాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తీ లాంగ్వేజ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.

రామాయణ ఇతిహాసంలో రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడి గురించి అందరికీ తెలిసిన విషయం ఒక్కటే. అతి నిద్ర. ఏడాదిలో 6 నెలల పాటు గాఢ నిద్రలో ఉంటాడని చెప్పుకుంటాం. ఎవరినైనా ఎక్కువగా నిద్రపోతుంటే.. కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడని అంటుంటాం. అయితే ఇప్పుడు ఆ కుంభకర్ణుడి నిద్రను యూపీ గవర్నర్‌ ఆనందిబెన్ పటేల్ చర్చనీయాంశంగా మార్చారు. ఇంతకీ ఆమె ఏన్నారంటే..

అసలు మొద్దునిద్రకు మారుపేరుగా చెప్పుకునే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయాడన్నది నిజం కాదని, ఆ సమయంలో రహస్యంగా యంత్రాల తయారీలో నిమగ్నమయ్యాడని ఆనందిబెన్ అన్నారు. ఆయన నిజానికి ఓ టెక్నోక్రాట్ అని ఆమె పేర్కొన్నారు. “కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు నిద్రపోతాడు, మిగతా 6 నెలలు మెలకువగా ఉంటాడు అని వింటుంటాం. కానీ ఇది నిజం కాదట.

“కుంభకర్ణుడు ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు. రహస్యంగా అనేక యంత్రాలను తయారు చేశాడు. ఆ టెక్నాలజీ వేరే దేశాలకు తెలియకుండా రహస్యంగా కాపాడుకునేవాడు.” అంటూ ఆనందిబెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ యూనివర్సిటీ కాన్వోకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. “రావణాసురుడే తన సోదరుడిని 6 నెలల పాటు బయటకు రాకుండా యంత్రాల తయారీలో నిమగ్నమవ్వాల్సిందిగా ఆదేశించారు. కానీ కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు అంటూ బయటకు ఒక వదంతి సృష్టించారు” అని ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఇప్పుడు ఈ వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఛైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాతే ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. యూనివర్సిటీ విద్యార్థులకు ఇలాంటి జ్ఞానాన్ని ఆమె ప్రభోదించారని విమర్శించారు.

విమానం కనిపెట్టింది రైట్ సోదరులు కాదు.. భరద్వాజ మహర్షి

ఆనందిబెన్ పటేల్ ఇదే కార్యక్రమంలో చేసిన మరో వ్యాఖ్య కూడా వైరల్ అవుతోంది. విమానం అనే కాన్సెప్ట్ వేదకాలంలోనే భరద్వాజ మహర్షి ప్రతిపాదించారని ఆమె పేర్కొన్నారు. విమానం కనిపెట్టింది రైట్ సోదరులు అనే మాట కూడా నిజం కాదని ఆమె అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు గతంలోనూ చాలామంది చేశారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.

రామాయణంలోనే రావణాసురుడు సీతను అపహరించి వాయుమార్గంలో లంకకు తీసుకెళ్లినట్టు చెప్పుకుంటాం. రామాయణంలోనే కాదు, ఇంకా అనేక పురాణేతిహాసాల్లో విమానాల ప్రస్తావన ఉంది. అంటే ఆ కాలంలోనే విమానాలు ఉండేవని, అందుకే పురాణాల్లో ప్రస్తావించారని కూడా చెబుతుంటారు. 2015లో జరిగిన 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో సమర్పించిన ఓ రీసెర్చ్ పేపర్ (అధ్యయన పత్రం)లో కూడా రైట్ బ్రదర్స్ కంటే 8 ఏళ్ల ముందు 1895లోనే భారతదేశానికి చెందిన శివకర్ బాపూజీ తల్పాడే ఒక ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారని పేర్కొన్నారు. అంతేకాదు, భారతదేశంలో 7వేల సంవత్సరాల క్రితమే ఎగిరే విమానాలు ఉండేవని, గ్రహాల మధ్య సైతం ప్రయాణాలు సాగించారని కూడా ప్రస్తావించారు.

వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ఆనందిబెన్ పటేల్ మాట్లాడుతూ.. భారతదేశంలో పూర్వీకులు ఎన్నో ఆవిష్కరణలు చేశారని, వాటినే నేటి ప్రపంచం ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. మన పురాతన గ్రంధాలను విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయాలని, అందులోని విజ్ఞానాన్ని వివిధ భాషల్లో మిగతా ప్రపంచానికి తెలియపరచాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…