AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత్యక్రియలకు వచ్చిన చిక్కులు.. లక్షలు పెట్టి 6అరడుగుల స్థలం కొంటున్న పరిస్థితి..!

ఇన్ని రోజులు బతకడమే కష్టం అనుకున్నాం.. కానీ, ఇప్పుడు చచ్చినా కష్టమే అన్న పరిస్థితి మొదలైంది. ఎన్నో బాధలు అనుభవించి, సంపాదించి, బాగా బతికి, చివరి రోజుల్లో అయినా కనీస ప్రశాంతత కోరుకుంటాడు ఏ మనిషైనా. అలాంటి పరిస్థితికే ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.

అంత్యక్రియలకు వచ్చిన చిక్కులు.. లక్షలు పెట్టి 6అరడుగుల స్థలం కొంటున్న పరిస్థితి..!
Graveyard
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 06, 2024 | 12:41 PM

Share

ఇన్ని రోజులు బతకడమే కష్టం అనుకున్నాం.. కానీ, ఇప్పుడు చచ్చినా కష్టమే అన్న పరిస్థితి మొదలైంది. ఎన్నో బాధలు అనుభవించి, సంపాదించి, బాగా బతికి, చివరి రోజుల్లో అయినా కనీస ప్రశాంతత కోరుకుంటాడు ఏ మనిషైనా. అలాంటి పరిస్థితికే ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. చచ్చినా సుఖం దొరకట్లేదు అన్న విధంగా తయారైంది ఇప్పుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? చనిపోతే అంత్యక్రియలు చేయడానికి పడుతున్న కష్టాల గురించే ఈ గోస అంతా.

మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మహా నగరాల్లో ఉన్న ప్రముఖ శ్మశానాల్లో ప్రజలు ముందు నుంచే భూమి కొనుగోలు చేసుకుని పెట్టుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. అదేంటీ.. బతికుండగానే చచ్చాక సంగతి ఆలోచిస్తున్నాం అంటారా? అవును నిజమే మరి.. పరిస్థితి అంత దాకా వచ్చింది. అంత్యక్రియలు చేయడానికి సరిపోయే భూమి లేక కొందరు లక్షల కొద్దీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న దుస్థితి. మరోవైపు, పాత సమాధులు తవ్వేసి అందులోనే అంత్యక్రియలు నిర్వహించాలని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రతినిధులు. మరి పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది.

హైదరాబాద్ మహానగరంలోని కొందరు ప్రజల అభిప్రాయం మేరకు వారి తాతముత్తాతల సమాధుల పక్కనే వాళ్లను కూడా చనిపోయాక పాతిపెట్టాలని చాలా మంది పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వక్ఫ్ బోర్డు చెబుతున్న మాట. పైగా 50 సంవత్సరాలు దాటిన సమాధుల్లో వారి కుటుంబ సభ్యులను పాతిపెట్టడంలో తప్పేమీ లేదని చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. మరి కొందరైతే ఈ విషయంలో కూడా ప్రాంతాల గొడవను లేవనెత్తుతున్నారు. ఓ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లు తమ ఏరియాలో వేరే ప్రాంతానికి చెందినవాళ్లకు అంత్యక్రియలకు అవకాశం ఇవ్వకూడదని, ఇక్కడ పాతిపెట్టేందుకు వీలు లేదని ఖరాకండిగా చెబుతున్నారు. ఇదే విషయమై హైదరాబాద్ లాంటి మహానగరంలో పలుమార్లు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఒక వ్యక్తిని పాతిపెట్టే సమయంలో జరిగిన వివాదం ఏకంగా రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక్కడ కూడా అదే సమస్య ఉత్పన్నమైంది. అంత్యక్రియలకు సరైన స్థలం లేదని ఆగ్రహించిన బస్తీ ప్రజలు తమ ప్రాంతంలో ఇలాంటి చర్యలకు వీలు లేదని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అక్కడి స్థానికులు తమ శ్మశానంలో వేరే వాళ్లని పాతిపెట్టొద్దని.. అలా బయట వాళ్లని పాతిపెడితే తమ బస్తీ వాళ్లని ఎక్కడ పాతిపెట్టాలని అడ్డుకున్నారు. ససేమిరా ఇక్కడ పాతిపెట్టే పనే లేదని ఆగ్రహిస్తూ నిరసన చేపట్టారు. దీని గురించి పెద్ద గొడవే జరిగింది. ఇలా చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో భూములనే శ్మశానాల కోసం కేటాయించింది. కానీ సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీని గురించి ఇక ముందైనా ఏదైనా శాశ్వత పరిష్కారం చూపెడితే ఇలాంటి గొడవలకు అవకాశం ఉండదనేది ఇక్కడ అందరి వాదన. మరి దీనిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా చావు విషయంలో కూడా మనిషికి ఇంత పెద్ద సమస్య ఏర్పడుతుందని, అంత్యక్రియలు చేయాలన్నా ఇంతలా ఆలోచించాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో కదా..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..