AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: రోగాలన్నీ మటుమాయం చేసే పవరున్న చెట్టు.. సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని

సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ప్రసిద్ధి. మారేడు వేర్లను చూర్ణం చేసి అర చెంచాడు చొప్పున కషాయంగా చేసి తీసుకుంటే అనేక రోగాలకు మెడిసిన్‌గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ బి, సి, కెరోటిన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ వంటివి మారేడు నుంచి పుష్కలంగా లభిస్తాయి.

Health: రోగాలన్నీ మటుమాయం చేసే పవరున్న చెట్టు.. సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని
Bilwa Leaves
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2024 | 4:44 PM

Share

బిల్వపత్రం. దీన్ని మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధ వ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా పని చేస్తుంది. మారేడు దళము గాలిని, నీటిని దోష రహితము చేస్తుంది. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలములలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. మెంతిపొడితో కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీని ఆకుల రసము షుగర్ వ్యాధి నివారణకు చాలా మంచిది.

మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడ పనిచేస్తుంది. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేగులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది. మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది. జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది. విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుము గా చేసినది బాగా ఉపకరిస్తుంది.

మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది. కడుపు లోను, పేగులలోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది. మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు , ఫలాలకు ఉన్నది.   బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది. బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి. క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)