AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health alert: ఫాస్ట్‌ఫుడ్ తిని యువతి మృతి! వైద్యుల హెచ్చరిక ఇదే

Fast Food: ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం ప్రమాదకరం, ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇటీవల, ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్‌ను అతిగా తినడం వల్ల 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పేగు ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీర్ఘకాలంగా అనారోగ్యకర ఆహార అలవాట్ల కారణంగా ఆమె జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, పేగులు కలిసిపోయాయని వైద్యులు వెల్లడించారు.

Health alert: ఫాస్ట్‌ఫుడ్ తిని యువతి మృతి! వైద్యుల హెచ్చరిక ఇదే
Fast Food
Rajashekher G
|

Updated on: Jan 05, 2026 | 3:58 PM

Share

ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 16 ఏళ్ల బాలిక, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మరణానికి అధికంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడమే ఒక కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

బాలిక గత కొన్నేళ్లుగా ఇంటి భోజనం కంటే ఎక్కువగా పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్‌కే అలవాటు పడినట్టు సమాచారం. ఇటీవల ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆమెకు పేగులకు సంబంధించిన తీవ్ర సమస్యలు ఉన్నట్టు గుర్తించి చికిత్స అందించారు. కొంతకాలం పరిస్థితి మెరుగుపడినట్టుగా కనిపించినా, అకస్మాత్తుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. గుండె సంబంధిత సమస్యలే మృతికి కారణమని వైద్యులు తెలిపారు.

ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం ప్రాణాంతకమా?

అనారోగ్యకరం అని తెలిసినప్పటికీ దాని రుచి కారణంగా జంక్ ఫుడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పొందింది. అయితే, జంక్ ఫుడ్‌ను తరచూ తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. జంక్ ఫుడ్ అంటే కేలరీలు అధికంగా ఉండి, పోషకాలు తక్కువగా ఉండే ఆహారం. ఇవి ఎక్కువగా కొవ్వు, చక్కెర, ఉప్పు, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లతో తయారవుతాయి. అయితే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి.

జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం:

ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా, దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. మన పేగులు ఆరోగ్యంగా పనిచేయాలంటే మంచి బ్యాక్టీరియా సమతుల్యత అవసరం. అయితే ఫాస్ట్ ఫుడ్‌లోని అధిక చక్కెరలు, సంతృప్త కొవ్వులు హానికరమైన బ్యాక్టీరియాను పెంచి, ఫైబర్‌ను ఇష్టపడే మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఈ అసమతుల్యతను డైస్బియోసిస్ అంటారు. దీని వల్ల పేగుల లోపలి పొరలో దీర్ఘకాలిక వాపు ఏర్పడుతుంది. ఆ వాపు కొనసాగితే పేగుల రక్షణ వ్యవస్థ దెబ్బతిని, ‘లీకీ గట్’ అనే సమస్యకు దారితీస్తుంది. దీని వల్ల జీర్ణం కాని ఆహార కణాలు, బ్యాక్టీరియా రక్తంలోకి చేరి శరీరం అంతటా వాపును పెంచుతాయి.

పేగులు కలిసిపోయే ప్రమాదం:

అధికంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల పేగుల్లో తీవ్రమైన వాపు ఏర్పడి, అవి ఒకదానికొకటి అంటుకుపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇటీవల విద్యార్థిని అహానాకు ఇదే సమస్య ఎదురైనట్లు సమాచారం. NHS వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పరిస్థితిని ఉదర సంశ్లేషణ (Abdominal Adhesions) అంటారు. ఇందులో మచ్చ కణజాలం బ్యాండ్లుగా ఏర్పడి, పేగులు, ఇతర అవయవాలు పరస్పరం అంటుకుపోతాయి. ఇవి శస్త్రచికిత్స, ఇన్ఫెక్షన్, గాయం లేదా దీర్ఘకాలిక వాపు కారణంగా ఏర్పడవచ్చు. కడుపు లోపలి పొరలో ఏ చిన్న భంగం వచ్చినా, శరీరం అధికంగా కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల ఫైబరస్ కనెక్షన్లు ఏర్పడి, నొప్పి లేదా పేగుల అడ్డంకి వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి.

వైద్యుల హెచ్చరిక

ఫాస్ట్ ఫుడ్‌ను తరచూ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఘటన ఫాస్ట్ ఫుడ్ అలవాట్లపై మరోసారి చర్చకు దారితీస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారమే దీర్ఘాయుష్షుకు మార్గమని నిపుణులు అంటున్నారు.