RIP Krishna Garu: బాధపడాల్సిన పనిలేదు.. కృష్ణ ఫ్యాన్స్ను వెరైటీగా ఓదార్చిన ఆర్జీవీ
తెలుగు సినిమా లెజండరీ, సూపర్స్టార్ కృష్ణ మృతితో యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు షాక్కి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని కోరుతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాటలకందని మహా విషాదాన్ని జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం. సినీ, రాజకీయ జీవితంలో సూపర్స్టార్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. కృష్ణ డెత్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది కాంటినెంటల్ ఆస్పత్రి. హాస్పిటల్కు తీసుకొచ్చిన సమయానికే కృష్ణ కండీషన్ సీరియస్గా ఉందని పేర్కొంది. వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశామని.. ఆ తర్వాత ICUకు షిప్ట్ చేశామని వెల్లడించింది. అవసరమైన క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అందించామని.. ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు వివరాలు తెలిపామని రిపోర్టులో స్పష్టం చేశారు. తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు కృష్ణ ప్రాణాలు విడిచారని చెప్పారు డాక్టర్ గురు ఎన్ రెడ్డి.
కృష్ణ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇక తమ దేవుడు లేడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మా ఘట్టమనేని ఎక్కడా అంటూ రోదిస్తున్నారు. ప్రస్తుతం నానక్రామ్గూడలోని నివాసంలో కృష్ణ పార్థివదేహం ఉంచారు. ప్రముఖులంతా కదిలి వచ్చి నటశేఖరుడికి నివాళి అర్పిస్తున్నారు. పలువురు నటీనటులు, టెక్నీషియన్లు సోషల్ మీడియాలో కృష్ణ గారితో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
కాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కృష్ణ మృతిపై ట్విట్టర్లో స్పందించారు. ఆయన కృష్ణ ఫ్యాన్స్ను తనదైన రీతిలో ఓదార్చారు. ‘కృష్ణ గారు ఇకలేరని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు అక్కడ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఆనందకరమైన సమయాన్ని గుడుపుతుంటారని భావిస్తున్నా’ అని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నాడు.
No need to feel sad because I am sure that Krishna garu and Vijayanirmalagaru are having a great time in heaven singing and dancing ??? https://t.co/md0sOArEeG via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2022
సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అభిమానులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం తర్వాత స్టేడియానికి తరలిస్తారు.
తీవ్ర దు:ఖంలో మహేశ్
ఈ ఏడాదిలో మహేశ్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.జనవరిలో మహేశ్బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు. అయితే అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి ఇందిరాదేవి దూరం అయింది. సెప్టెంబర్ 28న కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి మరణించింది. కన్న తల్లి దూరమైన బాధని ఇప్పుడిప్పుడే మరచిపోతున్న తరుణంలో కన్న తండ్రి కన్నుమూయడం.. మహేశ్ని మరింత విషాదంలోకి నెట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి




