Adipurush: ఆదిపురుష్ టీమ్ కావాలనే ఇలా చేశారనిపిస్తోంది.. కాంట్రవర్సీలపై రామాయణ్ సీరియల్ నటుడు..
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా...

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ దసరా రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విడుదల చేసిన టీజర్ చర్చకు దారి తీసింది. కొందరు టీజర్ ఆశించిన స్థాయిలో లేదంటే.. మరికొందరు భారతీయ సంస్కృతిని తప్పుగా చూపించారు అంటూ విమర్శలు చేశారు. దీంతో ఈ అంశంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అయితే విమర్శల దాడి మాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ వివాదంపై దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడి పాత్రలో నటించిన సునీల్ లహ్రీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఆదిపురుష్ టీజర్ చూశాను. బాగుంది, బాలేదని నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతానికి నా ఆలోచనలు తటస్థంగా ఉన్నాయి. సినిమాలోని పాత్రలు, వారి ఆహార్యాన్ని మాత్రమే పరిచయం చేశారు. ఇక వివాదం విషయానికొస్తే చిత్ర యూనిట్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికే ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారనిపిస్తోంది’ అని సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఆదిపురుష్ టీజర్..
సునీల్ లహ్రీ ఇంకా మాట్లాడుతూ.. రామాయణం కథ మనందరికీ తెలిసిందేనని, గత కొన్నేళ్లుగా రాముడంటే ఇలానే ఉంటాడని మనందరిలో ఓ ఆలోచన ఏర్పడిపోయిందని చెప్పుకొచ్చారు. ‘అయితే చిత్ర యూనిట్ ఆ ఆలోచనను బ్రేక్ చేస్తూ నటీనటుల లుక్స్ను కొత్తగా చూపించారు. మన విశ్వాసాలకు వ్యతిరేకంగా అర్థంలేని విధంగా ఏదైనా చూపిస్తే ప్రేక్షకులు సహించరు. తమ సత్తా ఏమిటో ఇప్పటికే వాళ్లు పలు సందర్భాల్లో బయటపెట్టారు’ అని వివరించారు. మరి ఈ విమర్శల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు పడుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..







