230సినిమాలు.. నాలుగు భాషలు.. ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. ఇప్పటికీ సింగిలే
చిత్రపరిశ్రమలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణలతో నటించింది.

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల ఆశీస్సులతో రాణించిన హీరోయిన్లలో ఈ అందాల తారది చాలా ప్రత్యేకం. ఆమె విశాలమైన కళ్లు, చక్కటి ముఖం, చూపులను ఆకట్టుకునే రూపం, లావణ్యం, కట్టిపడేసే అభినయం, నాట్యం ఆమెను తెలుగు వారికి మరింత దగ్గర చేశాయి. తెలుగు చిత్రాలతోనే ఆమె విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. పెళ్లి చేసుకోకుండా నాట్యానికి తన జీవితాన్ని అంకితం చేశారు ఆమె. ఈ అందాల తార ఎవరో తెలుసా.. ఆమె మరెవరో కాదు అందాల నటి శోభన. 1970 మార్చి 21న తిరువనంతపురంలో జన్మించారు. ప్రముఖ మలయాళ నటి సుకుమారి ఆమెకు దగ్గర బంధువు. రెండేళ్ళ ప్రాయంలో రాజేష్ ఖన్నా నటించిన అమర్ ప్రేమ్ సినిమాలో ఒక సన్నివేశంలో అలా కొన్ని క్షణాలు కనిపించారు. ఆ తర్వాత సుప్రసిద్ధ నటీమణి కె. ఆర్. విజయ ప్రోత్సాహంతో 1980లో వచ్చిన మంగళనాయకి చిత్రంలో శోభన బాలనటిగా నటించారు.
ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి
మంగళనాయకి చిత్ర శతదినోత్సవానికి అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా వచ్చి, 10 ఏళ్ళ శోభనను చూసి ఆశ్చర్యపోయిన సంఘటన విశేషం. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం భక్త ధ్రువ మార్కండేయ. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి అంతా బాలతారలతో తీసిన ఈ సినిమాలో శోభన ధ్రువుని తల్లిగా నటించారు. తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న శోభన ఆ తర్వాత ఐదేళ్ల పాటు చదువు, నృత్యం మీదే దృష్టి పెట్టారు. మలయాళ సాంప్రదాయ కుటుంబంలో శోభన పుట్టినా, మద్రాస్ లోనే పెరిగారు. ఆమె తల్లి ప్రోత్సాహంతో, భరతనాట్యంలో గొప్ప పేరు పొందిన శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ దగ్గర శిష్యురాలిగా చేరారు. మొదట్లో డాన్స్ పట్ల ఆసక్తి లేకున్నా, తల్లి నచ్చజెప్పడంతో 15 ఏళ్ళు వచ్చేసరికి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. గురువు చిత్రతో కలిసి అనేక దేశాలు పర్యటించి ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యం వల్ల తొమ్మిదో తరగతి చదువుతుండగా సినిమాల్లోకి వచ్చినా, గ్రాడ్యుయేషన్ పూర్తి కావాలనే పట్టుదలతో ప్రైవేట్ గా చదివి, 1989లో వైజాగ్ సెంటర్ లో ఇంటర్ పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.
ఇది కూడా చదవండి : అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్
శోభన హీరోయిన్ గా నటించిన తొలి సినిమా 1984లో మలయాళంలో వచ్చిన ఏప్రిల్ 18. బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తొమ్మిదో తరగతి చదువుతున్న శోభన కథానాయికగా పరిచయమయ్యారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. తెలుగులో శోభన నటించిన తొలి సినిమా విక్రమ్. ఈ సినిమాతోనే అక్కినేని నాగార్జున హీరోగా పరిచయం అయ్యారు. స్క్రీన్ వారపత్రికలో శోభన ఫోటో చూసి ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. విక్రమ్ శోభనకు తొలి తెలుగు సినిమా అయినా, విడుదలైన మొదటి చిత్రం భానుచందర్ హీరోగా నటించిన దాగుడుమూతలు. అప్పటి నుంచి తెలుగులో శోభనకు అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి తొలి సొంత సినిమా రుద్రవీణలో, అలాగే రౌడీ అల్లుడు చిత్రంలోనూ చిరంజీవితో జతకట్టారు. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా చేశారు. నిప్పురవ్వ సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలకృష్ణతో నటించారు తర్వాత నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, హీరో కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, భానుచందర్, కార్తీక్ వంటి వారితోను శోభన నటించారు. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కనిపించి ఆకట్టుకున్నారు. మలయాళ సినిమా మణిచిత్రతాళులో ద్విపాత్రాభినయంతో మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో నిలిచారు. దక్షిణాదిలో నాలుగు భాషల్లోనూ నటించిన శోభన, సినిమాల్లో పోటీ పెరిగి, అవకాశాలు తగ్గుముఖం పట్టే సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకోకుండా, తనకు ఎంతో ఇష్టమైన నాట్యకళకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచి నాట్య కళారాధనలో కొనసాగుతూ, దేశ విదేశాల్లో భరతనాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు.




