Lok Sabha Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం చోటుచేసుకుంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు ఎలక్షణ్ కమిషన్ గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్..

హైదరాబాద్, ఏప్రిల్ 18: సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం చోటుచేసుకుంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు ఎలక్షణ్ కమిషన్ గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్.. రాష్ట్రాల్లో మొత్తం 96 లోక్సభ స్థానాలకు గానూ 4వ దశ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీంతో ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ చేపడతారు. లోక్సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు చొప్పున ధరావతు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
The Gazette notification has been issued for the 4th phase of general elections. Polling will take place for 96 Lok Sabha seats across 10 states Andhra Pradesh, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Odisha, Telangana, Uttar Pradesh, West Bengal, and Jammu & Kashmir.… pic.twitter.com/xyjCS0xesf
— ANI (@ANI) April 18, 2024
నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. రేపు, ఈనెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాను ఏప్రిల్ 29న ప్రకటించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29న అవకాశం ఇచ్చారు. మే 13న పోలీంగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
ఓటుహక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. మే 8లోపు వీరు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు బ్యాంకు లావాదేవాలపై నిఘా పెడుతున్నారు. బ్యాంకుల నుంచి లక్ష రూపాయాలు, ఆపై డ్రా చేసినా, జమ చేసినా ఆ ఖాతాలను పరిశీలించనున్నారు. రూ. 10లక్షలకు మించి డ్రా చేసిన వారి సమాచారాన్ని బ్యాంకు అదికారులు ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. తగిన ఆధారాలు చూపిస్తేనే ఆయా డబ్బును వెనక్కి ఇస్తున్నారు.
మరిన్ని రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి.