AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంధువుతో అక్రమసంబంధం…శవంగా మారిన ఆటోడ్రైవర్

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఎన్నో కాపురాలను కకావికలం చేస్తున్నాయి. వేరొకరితో పెట్టుకుంటున్న సంబంధాలు భార్యభర్తల్ని, వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకునే భర్తనే అతికిరాతకంగా చంపించింది ఓ భార్య...

బంధువుతో అక్రమసంబంధం...శవంగా మారిన ఆటోడ్రైవర్
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2020 | 1:40 PM

Share

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఎన్నో కాపురాలను కకావికలం చేస్తున్నాయి. వేరొకరితో పెట్టుకుంటున్న సంబంధాలు భార్యభర్తల్ని, వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకునే భర్తనే అతికిరాతకంగా చంపించింది ఓ భార్య. తన సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. చివరకు అసలు విషయం బయటపడటంతో ప్రియుడితో కలిసి కటకటాల్లోకి వెళ్లింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణం నందలపాడుకు చెందిన దంపతులకు ఇద్దరు సంతానం. ఓ కూతురు, కొడుకు ఉన్నారు. భర్త ఆటోలో మినరల్ వాటర్ సరఫరా చేస్తుండగా, భార్య ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె వారి సమీప బంధువు అయిన ఓ ఆటోడ్రైవర్‌‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలా కొన్నాళ్లుగా వీరి ఇద్దరి మధ్య సాగుతున్న వ్యవహారం ఓ రోజున భర్తకు తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని వారిద్దరిని మందలించాడు భర్త. అయినప్పటికీ వారిద్దరూ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమ బంధానికి తరుచూ అడ్డుపడుతున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలోనే పథకం ప్రకారం అతన్ని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడే అతడిపై దాడి చేసి హతమార్చారు. తర్వాత అది ఆక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కానీ, వారి పాపం ఎక్కువ రోజులు దాగలేదు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు..అసలు నిందితులను గుర్తించారు. అక్రమ సంబంధం కారణంగానే హత్యచేసినట్లుగా నిర్థారించిన పోలీసులు నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు తండ్రి చనిపోవటం, మరో వైపు తల్లి జైలుకు వెళ్లటంతో వారి పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలిపోయారు.

Follow Us