కిరాయి దొంగలు..నెలకు రూ.40వేల జీతం !
నెలకు 40 వేల జీతం, ఉద్యోగం దొంగతనం చేయడం. ఇదేంటి అనుకుంటున్నారా? అవును...స్మార్ట్ ఫోన్లు, పర్సులను కొట్టేసేందుకు ఇద్దరు మైనర్లను నెలకు 40వేల జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిని సిద్దిపేట పోలీసులు అరెస్టు చేయడంతో మొత్తం దొంగల కార్ఖానా బయటపడింది.
నెలకు 40 వేల జీతం, ఉద్యోగం దొంగతనం చేయడం. ఇదేంటి అనుకుంటున్నారా? అవును. సిద్దిపేటలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, పర్సులను కొట్టేసేందుకు ఇద్దరు మైనర్లను.. మరో ఇద్దరు సీనియర్ దొంగలు నెలకు 40వేల జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిని సిద్దిపేట పోలీసులు అరెస్టు చేయడంతో మొత్తం దొంగల కార్ఖానా బయటపడింది.
కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఇద్దరు పిల్లలు ఈ పనిచేస్తున్నట్టు పోలీసుల ఇంటరాగేషన్లో బయట పడింది. ఈ ఇద్దరు 12,13 ఏళ్ల మైనర్లు. గత రెండున్నరేళ్ల నుంచి వీరు పర్సులు, ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఒప్పందం ప్రకారం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉంటున్న ఇద్దరు మైనర్ల కుటుంబాలకు సీనియర్ దొంగలు నెలకు 40వేలు పంపిస్తున్నారు.
గత నెల 22న సిద్దిపేటలోని రైతు బజార్లో ఓ సెల్ఫోన్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా చోరీ జరిగిన తీరు వెలుగులోకి వచ్చింది. రైతు బజార్లోకి ప్రవేశించిన ఈ దొంగల గ్యాంగ్లోని మైనర్లు ఓ వ్యక్తి నుంచి సెల్ఫోన్, మరో వ్యక్తి నుంచి పర్సు కొట్టేశారు.
కొట్టేసిన ఫోన్లను రంగారెడ్డి జిల్లా చెంగిచెర్లకు చెందిన గుజ్జాల వెంకట్కు అప్పగించారు. ఈ బ్యాచ్లో రెండో వ్యక్తి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గుంజా గంజయ్య. ఇతను మహేంద్ర బొలేరో వాహనంలో పార్కింగ్ స్ధలంలో వెయిట్ చేస్తుంటాడు. కొంత కాలంగా ఈ నలుగురు దొంగలపై పోలీసులు నజర్ పెట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వన్టౌన్ పోలీసులు సిద్దిపేట పాత బస్టాండ్లో బొలేరో వాహనాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై చుట్టుముట్టడంతో గంజయ్య దొరికిపోయాడు. మిగతావారు పరారీలో అయ్యారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.