కవ్వాల అభయారణ్యాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
కొవిడ్ ప్రబలడంతో కూంబింగ్ను తాత్కాలికంగా నిలిపివేసిన పోలీసులు బలగాలు మళ్లీ కవ్వాల అభయారణ్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. కనిపించిన వారినల్లా వివరాలు అడిగి తెలుసుకుంటూ కూంబింగ్ జరుపుతున్నారు
ఆర్నెళ్ల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న మావోయిస్టులు పలుమార్లు పోలీసులకు ఎదురుపడి త్రుటిలో తప్పించుకున్నారు. స్వయంగా డీజీపీ మహేందర్రెడ్డి ఆసిఫాబాద్లో బస చేసి, మావోయిస్టుల గాలింపు చర్యలను సమీక్షించారు. ఇటీవల వరుసగా వర్షాలు పడడం, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక దళాల కారణంగా కొవిడ్ ప్రబలడంతో కూంబింగ్ను తాత్కాలికంగా నిలిపివేసిన పోలీసులు బలగాలు మళ్లీ కవ్వాల అభయారణ్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. కనిపించిన వారినల్లా వివరాలు అడిగి తెలుసుకుంటూ కూంబింగ్ జరుపుతున్నారు. గురువారం లక్షెట్టిపేట పోలీలసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసు బలగాలు తగ్గడంతో మావోయిస్టులు తమ కదలికలను మరింత ముమ్మరం చేశారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మావోయిస్టులను కట్టడి చేయడానికి మళ్లీ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే అల్లినగర్, దొంగపెల్లి, మల్యాల, హాస్టల్తండా, లోతొర్రె గ్రామాల పరిసరాలలో భద్రతా దళాలు గాలింపులు చేపట్టారు. ఆదివాసీ యువకుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు. అలాగే, మావోయిస్టుల ఆటాపాటలు, మాటలకు ఆకర్షితులు కావద్దని, మంచి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతున్న పోలీసులు, యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అటవీ ప్రాంతంలోకి అనుమతి లేకుండా వెళ్ళకూడదని సూచించారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు.