Crime News: హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ.. దర్యాప్తులో నిజాలు తెలిసి షాక్‌కు గురైన పోలీసులు

ప్రకాశంజిల్లాలో హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. పోలీసులమంటూ కారులో వెళుతున్న బంగారం వ్యాపారులను బెదిరించి

Crime News: హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ.. దర్యాప్తులో నిజాలు తెలిసి షాక్‌కు గురైన పోలీసులు
Prakasam Sp P
Follow us

|

Updated on: Sep 06, 2021 | 3:07 PM

Highway Robbery: ప్రకాశంజిల్లాలో హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. పోలీసులమంటూ కారులో వెళుతున్న బంగారం వ్యాపారులను బెదిరించి 50 లక్షలు ఎత్తుకెళ్ళారు దోపిడీ దొంగలు. నిందితుల్లో కడప జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌, ఓ యూట్యూబ్‌ చానల్ విలేకరి ఉన్నారు. దోపిడీకి గురైన నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. సంచలనం సృష్టించిన ఈ దారి దోపిడీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు. ఓ కానిస్టేబుల్‌తో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 47 లక్షల నగదు, రెండు కార్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

ఇక, సీన్ లో ఏంజరిగింది.. దర్యాప్తులో ఏంతేలిందో చూద్దాం.. ‘మీ దగ్గర నల్ల డబ్బు ఉంది. ఆ విషయమై మాట్లాడేందుకు మిమ్మల్ని డీఎస్పీ పిలుస్తున్నారు. ఆఫీస్‌కు రావాలి…’ అని పోలీసు దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రకాశంజిల్లా గుడ్లూరు దగ్రగ జాతీయ రహదారిపై కారులో వెళుతున్న బంగారం వ్యాపారులను బెదిరించారు. అనంతరం వ్యాపారుల నుంచి 50 లక్షల నగదు దోపిడీకి పాల్పడ్డారు. ప్రకాశంజిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్‌ దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆగస్టు 31వ తేదిన జరిగింది.

నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి చిరంజీవి.. ఆయన తన మిత్రులు హరి, వెంకటేష్‌తో కలిసి విజయవాడలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆగస్టు 31వ తేదీ ఉదయం నెల్లూరు నుంచి కారులో వెళ్తున్నారు. గుడ్లూరు మండలంలోని శాంతినగర్‌ వద్దకు వచ్చేసరికి వారి వాహనానికి వేరే కారును అడ్డుగా పెట్టి కొందరు అడ్డుకున్నారు. అందులో నుంచి నలుగురు వ్యక్తులు పోలీసు దుస్తుల్లో కిందికి దిగారు.

‘మీ కారులో లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. ఆ విషయమై మాట్లాడటానికి డీఎస్పీ పిలుస్తున్నారు. ఆఫీస్‌కి రావాలి’ అంటూ పిలిచారు. వ్యాపారులు కిందికి దిగకపోయేసరికి వారిలోని ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కారు. ముందు ఇద్దరు నకిలీ పోలీసులు తమ వాహనాన్ని నడుపుతుండగా.. వెనుక వ్యాపారుల కారును ఫాలో చేయించారు. సింగరాయకొండ సమీపంలోని కందుకూరు వైపు రెండు వాహనాలను మళ్లించి నిలిపి వేశారు. ఉన్నతాధికారితో మాట్లాడేందుకు 25 లక్షలు ఇవ్వాలని వ్యాపారులను నకిలీ పోలీసులు డిమాండ్‌ చేశారు. చర్చలు సాగిస్తుండగానే 50 లక్షల నగదున్న సంచిని బలవంతంగా లాక్కుని తమ కారులో పరారయ్యారు. పోలీసులకు వ్యాపారులు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా నెల్లూరు వెళ్లారు. అక్కడ మిగిలిన వ్యాపారులతో మాట్లాడుకుని ఈనెల 3వ తేదీన సాయంత్రం తిరిగి వచ్చి గుడ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వి.శ్రీరామ్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతికత, కారు నంబరు ఆధారంగా నిందితులు కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి చిరంజీవి దగ్గర కారుడ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌ తన యజమాని బంగారం కొనేందుకు విజయవాడ వెళుతుంటాడని, ఈ సందర్బంగా లక్షల్లో నగదు తీసుకుని కారులో వెళతారని మిగిలిని నిందితులకు సమాచారం ఇవ్వడంతో ఈ దోపిడీకి ప్లాన్‌ వేసి సక్సెస్‌ అయ్యారు.

ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో ఓ పోలీసు కానిస్టేబుల్‌, ఓ గ్రామ వాలంటీర్‌ కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. అట్లూరు మండలంలోని వరికుంటకు చెందిన వాలంటీరు గోపికృష్ణ, అట్లూరు పీయస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొరివి సుధాకర్‌, యూట్యూబ్‌ విలేఖరి సుబ్బరాయుడు దోపిడీలో ప్రధాన నిందితులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వాలంటీరు బంధువులకు సంబంధించిన కారును ఇందుకు ఉపయోగించారు.

కానిస్టేబుల్‌ సుధాకర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గత నెల 30వ తేదీ నుంచి హాజరుకావడం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి గుడ్లూరు పోలీసులు చేపట్టిన దర్యాప్తు వివరాలను, దోపిడీ జరిగిన తీరును జిల్లా ఎస్‌పీ మలిక గార్గ్‌ వివరించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి 47 లక్షల నగదు, రెండు కార్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి తెలిపారు.

Read also: Private: Pregnant Lady: పురిటి నొప్పులతో విలవిల్లాడిన గర్భిణి, ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గం లేక.. రైల్వే ట్రాక్‌పై తరలిస్తున్న వైనం