కరోనాను మోసుకొచ్చిన ఆ ఐదు రైళ్లు..మీరు ఎక్కారా..?
ఇప్పుడు కరోనా వైరస్ వారి నుంచే దేశ వ్యాప్తంగా విజృంభిస్తుందని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇంటెలిజెన్స్ను రంగంలోకి దింపింది. ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో పడింది..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మత ప్రార్థనలతో దేశ వ్యాప్తంగా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. దీంతో మహమ్మారి బారిన పడినవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విదేశాల నుంచి సైతం పలువురు మత ప్రభోదకులు ఈ ప్రార్థనలకు హాజరు కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ వైరస్ సోకిన విషయం ప్రార్థనలకు హాజరైన వారికి తెలియకపోవడంతో స్వరాష్ట్రాలకు తిరుగు పయనమయ్యారు. అయితే వారిలో కొంతమంది మార్చి 30 వరకు మర్కజ్లోనే మకాం వేయగా.. ఢిల్లి రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ క్వారంటైన్కు తరలించింది.
ఈ మతపరమైన కార్యక్రమానికి దాదాపు మూడు వేల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 1200 మందికిపైగా యాత్రికులు వారివారి స్వరాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఇప్పుడు కరోనా వైరస్ వారి నుంచే దేశ వ్యాప్తంగా విజృంభిస్తుందని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇంటెలిజెన్స్ను రంగంలోకి దింపింది. ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో పడింది. ప్రధానంగా ఐదు రైళ్ల ద్వారా వీరు ప్రయా ణించినట్లుగా అధికారులు గుర్తించారు. ఢిల్లీ టూ గుంటూరు దురంతో ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ రాంచి ఎక్స్ప్రెస్ అనే ఈ ఐదు రైళ్ల ద్వారా మార్చి 13, 19 తేదీలలో మర్కజ్కు దాదాపు 1200 మంది ప్రయాణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
అయితే, వీరిలో ఎంతమంది రైళ్ల ద్వారా వారి వారి స్వస్థలాలకు చేరారన్న సంఖ్యపై ఇంత వరకు స్పష్టత లేదు. మరోవైపు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారు కూడా స్వచ్ఛందంగా బయటకు రాకపోవడంతో అనేక రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. వీరందరినీ గుర్తించేందుకు ఆయా రాష్ట్రాల అధికారులు అనేక అగచాట్లు పడుతున్నారు. ఫోన్ నంబర్లు, పేర్లు, అడ్రస్లు సరిగా లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. ఈ 1200 మంది ఈ ఐదు రైళ్లలో ప్రయాణించడం వల్ల వారి తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళనలో ఉన్నారు.
ఇప్పటికే ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రభోదకులు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ద్వారా తెలంగాణలోని రామగుండం చేరుకోవడం, వారందరికీ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి యాత్రికులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1085 మంది ఢిల్లీలో జరిగిన మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. వీరిలో 70 శాతం మందిని దాదాపుగా అధికార యంత్రాంగం గుర్తించింది. 585 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 70 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. మరో 17 మందికి వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది.