Chinese City Xian Food Shortages: చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో కఠిన ఆంక్షలు విధించింది చైనా. ఈ ఆంక్షలు అక్కడి ప్రజల పాలిట శాపంగా మారాయి. కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదని, అధికారులతో గొడవకు దిగుతున్నారు షియాన్ సిటీ ప్రజలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లాక్డౌన్లతో పోలిస్తే, ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసరాల కోసం కూడా బయటకు రానివ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు.
షియాన్ నగరంలో 10 రోజులుగా లాక్డౌన్ అమల్లో ఉంది. మొదట్లో ఆంక్షలు తక్కువగా ఉండేవని, ఆహారం, ఇతర అవసరాల కోసం రెండు రోజులకొకసారి ఇంటికొక వ్యక్తిని బయటకు వెళ్లనిచ్చేవారని వారు చెబుతున్నారు. కానీ, రెండు రోజులుగా, కోవిడ్-19 టెస్టులకు తప్ప మరే కారణంగా బయటకు రానీయడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. దీంతో తమకు ఆహారం, ఇతర సరుకులు కావాలంటూ షియాన్ వాసులు సోషల్ మీడియాలో సాయం అడుగుతున్నారు. ప్రభుత్వం పంపిన సరుకులు అందడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే, సిబ్బంది కొరత కారణంగా సరుకుల పంపిణీలో ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు అధికారులు.
అయితే, కొద్దిరోజులుగా షియాన్ నగరంలో జీరో-కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు మూతపడ్డాయి. విమానా సర్వీసులను నిలిపేశారు. అయితే, ఇంత కఠిన ఆంక్షలు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి వింటర్ ఒలింపిక్ ఈవెంట్ కారణమని చెబుతున్నారు అక్కడి అధికారులు. ఎందుకంటే, వచ్చే నెలలో జరిగే వింటర్ ఒలింపిక్ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనుంది చైనా. వింటర్ ఒలింపిక్ ఈవెంట్కు కోవిడ్ అతిపెద్ద ముప్పు అని గతంలోనే చెప్పింది చైనా.
Read Also… ITR Returns: వివిధ కారణాలతో ఐటీ రిటర్న్ని వెరిఫై చేయలేకపోయారా?.. అయితే మీకో గుడ్న్యూస్..!