పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బల్లి
అసలే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కంటిమీద కునుకులేకుండా డ్యూటీ చేస్తున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు ఓ బల్లి ముచ్చెమటలు పట్టించింది.
అసలే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కంటిమీద కునుకులేకుండా డ్యూటీ చేస్తున్నారు. కడుపుకు తిండి, కంటికి నిద్రా లేకుండా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. ఇంటికి వెళ్లినా కూడా వారిని వైరస్ భయం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే పోలీసుల్లోనూ చాలా మంది ఇప్పుడు వైరస్ బారిన పడుతున్నారు. ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు ఓ బల్లి ముచ్చెమటలు పట్టించింది. అర్ధరాత్రి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. బల్లికి అంతా సీన్ ఉందా అనుకుంటున్నారా..? అయితే, వివరాల్లోకి వెళితే…
సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీసులను అర్ధరాత్రి ఓ బల్లి హడలెత్తించింది. చిలకలగూడలోని ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో అర్ధరాత్రి ఎమర్జెన్సీ సైరన్ మోగింది. దీంతో ఉలిక్కి పడ్డ స్థానికులు ఏటిఎంలో దొంగలు పడ్డారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. . పోలీసులు హుటాహుటినా అక్కడకు చేరుకుని ఏటీఎంను తెరిచి చూశారు. కానీ, అందులో డబ్బులు పోలేదు. అక్కడంతా మామూలుగానే ఉంది. కానీ, సైరన్ ఎలా మోగిందనే చూసిన పోలీసులు, స్థానికులు ఖంగుతిన్నారు. ఏటీఏంలోపల ఉన్న సైరన్ పైకి బల్లి వెళ్లటంతో అలారమ్ మోగినట్లుగా గుర్తించి అందరూ అవాక్కయ్యారు. లాక్డౌన్ సమయంలో బల్లి చేసిన పనికి కాసేపటికి అంతా నవ్వుకున్నారు.