Covid-19 Vaccine: దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర సర్కార్!
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచలను జారీ చేసింది.
Covid-19 Vaccine: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచలను జారీ చేసింది. దీనితో పాటు, వ్యాక్సిన్ బూస్టర్ మోతాదులను వేగంగా ఇవ్వడంపై కూడా శ్రద్ధ చూపాలని అయా రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. త్వరలో టీకా రెండవ, మూడవ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించవచ్చని తెలుస్తోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా మూడవ ముందు జాగ్రత్త మోతాదు తీసుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. కాగా, దీనితో పాటు రెండవ, మూడవ డోసుల మధ్య కనీసం 9 నెలల గ్యాప్ ఉండాలని కూడా చెప్పింది. అంటే, మీరు మొదటి డోస్ను జనవరి 2022లో వేస్తే, మీకు రెండవ డోస్ సెప్టెంబర్ 2022లో ఇవ్వనున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవ, మూడవ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కరోనా ఇన్ఫెక్షన్లో ఉన్నవారికి కూడా ఉపశమనం ఇస్తుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా కూడా ఇదే డిమాండ్ చేశారు. రెండవ, మూడవ డోసుల మధ్య గ్యాప్ కనీసం 6 నెలలు చేయాలని ఆయన చెప్పారు. ఇందుకోసం ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్యాప్ను 9 నెలలకు బదులుగా 6 నెలలకు ప్రభుత్వం త్వరలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఇటీవల కాలంలో పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. భారతదేశంలో గత 24 గంటల్లో 2,927 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,30,65,496కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 32 మరణాలు సంభవించాయి. దీని కారణంగా మరణాల సంఖ్య 523,654 కు పెరిగింది.