రూ. 1500 మీ అకౌంట్లో పడలేదా..అయితే, ఈ క్రింది నంబర్కి ఫోన్ చేయండి
టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి రేషన్ కార్డు నంబర్ చెబితే, వారు పరిశీలించి వివరాలు వెల్లడించనున్నారు. ఏదైన సమస్య ఉంటే ఆఫీసుకు వెళితే అక్కడ బయోమెట్రిక్ తీసుకుని వెంటనే డబ్బు ఇస్తారని తెలిపారు.

కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రెక్కాడితే గానీ, నిరుపేదలు ఉపాధి లేక, చేతిలో డబ్బు లేక, తినేందుకు తిండికూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలేవరూ ఆకలితో ఉండకుండా చూడాలని, అందుకు తగిన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా రేషన్ దుకాణాల్లో ఉచితంగా బియ్యం పంపిణీ, నిత్యావసరాల కోసం రూ. 1500 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
కాగా, కొంత మందికి ఇప్పటికీ డబ్బులు జమ కాలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఎవరికైనా ఈ డబ్బులు అకౌంట్లలో జమ కాకపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించింది. దీనిపై అధికారులు స్పందించి తప్పులు సరిచేసి డబ్బులు లబ్ధిదారులకు అందజేస్తారని పేర్కొంది. తమ ఖాతల్లో డబ్బు జమకాలేదని తెలుసుకున్న లబ్ధిదారులు అందుకోసం ల్యాండ్ లైన్ 040–23324614, 23324615 నంబర్లను గానీ, టోల్ ఫ్రీ నంబర్ 1967ను గానీ సంప్రదించాలని అధికారులు సూచించారు.
బ్యాంకు ఖాతాలు లేనివారికి తపాలా శాఖ ద్వారా కూడా నగదును పంపిణీ చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి రేషన్ కార్డు నంబర్ చెబితే, వారు పరిశీలించి వివరాలు వెల్లడించనున్నారు. ఏదైన సమస్య ఉంటే పోస్టాఫీసుకు వెళితే అక్కడ బయోమెట్రిక్ తీసుకుని వెంటనే డబ్బు ఇస్తారని తెలిపారు. రేషన్ కార్డు లేని పేదలకు కూడా సాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో 5.21 లక్షల మందికి పైగా రేషన్ కార్డు లేవని వారికి ఇవ్వాల్సిన రూ. 78.24 కోట్ల మొత్తాన్ని తపాలా శాఖలో జమ చేసినట్టు చెప్పారు.
