కరోనా విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఊహించని సంఘటనలు !
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి వారికి ..
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరినీ కదిలించిన కరోనా మాట తప్ప మరొకటి లేదు. ఇంటా, బయట అందరూ కరోనాకు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపించినా.. వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా వణికిపోవాల్సిన పరిస్థితి. ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్కు తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి వారికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. కానీ, చిత్తూరు జిల్లాలో రెండు వేర్వేరు ఘటనలు చోటు చేసుకున్నాయి.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మహిళా ఎస్ ఐ ని స్థానికులు ఎంతగానో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నిర్వీరామంగా కరోనా విధుల్లో పాల్గొన్న మహిళా ఎస్ ఐ..డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన సందర్బంగా స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కరోనా పోరులో ఆమె సేవలను కొనియాడుతూ స్థానికులు పూలవర్షం కురిపించారు. ఇదిలా ఉంటే కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన మరో ప్రభుత్వ మహిళా ఉద్యోగిని ఇంటి యజమాని అడ్డుకున్నాడు. కరోనా లేదని తెలిసినా అనుమతించలేదు. ఆమెకు చీవాట్లు పెట్టాడు.. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికి ఎలా వస్తావంటూ చిందులేశాడు. ఇంటినుంచి బయటకెళ్లమని తేల్చి చెప్పాడు. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమనడంతో విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఆమెకు తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేశారు.