పోకిరీల భరతం పడుతున్న పోలీస్ డ్రోన్స్…
హైదరాబాద్లోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, పార్కులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కానీ, కొన్ని గల్లీలు, వీధుల్లో మాత్రం పోకిరీలు మాట వినటంలేదు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో హైదరాబాద్లోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, పార్కులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కానీ, కొన్ని గల్లీలు, వీధుల్లో మాత్రం పోకిరీలు మాట వినటంలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అటువంటి వారి పనిపట్టేందుకు నగర పోలీసులు సరికొత్త ప్లాన్ వేశారు. కాలనీలు, గల్లీలలో ఒక్కచోట చేరే వాళ్ల పనిపట్టేందుకు డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తున్నారు. ఈ కెమెరా ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలా రోడ్ల మీద గుమిగూడి ఉంటున్న వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగించిన డ్రోన్ కెమెరా సంబంధించిన విజువల్స్లో కొంత మంది గుమిగూడి ముచ్చటించుకుంటున్న యువకులు డ్రోన్ కెమెరా చూడగానే పరుగులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ కెమెరా విజువల్స్ను పోలీసు అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. ఎక్కడైనా సరే పబ్లిక్ ఉన్నట్లు సమాచారం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో వారిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 డ్రోన్ కెమెరాల ద్వారా జన సంచారాన్ని సమీక్షిస్తామని కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.