లాక్డౌన్ పొడిగింపు ! ప్రధాని ఆమోదమే తరువాయి…ఎప్పటి వరకు ..
భారత్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ ప్రతాపం చూపెడుతోంది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ను పొడిగించాలని కేంద్రం దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
భారత్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ ప్రతాపం చూపెడుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 3,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండో దశను దాటి సామూహిక వ్యాప్తిలోకి ప్రవేశించినట్టు ఎయిమ్స్ సైతం ధ్రువీకరించింది. ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. మొత్తం 211 జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
వివిధ రాష్ట్రాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఐదు వేలు దాటాయి. అలాగే వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 165కు చేరింది. మంగళవారం మొత్తం 560కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో లాక్డౌన్ ఎత్తివేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే సందిగ్ధం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో మరికొన్నిరోజులు లాక్డౌన్ పొడిగిస్తేనే వైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతుందనే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.
లాక్డౌన్ను పొడిగించాలని కేంద్రం దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజ్ నాథ్ నాయకత్వంలో సమావేశమైన మంత్రుల బృందం ఈ మేరకు తీర్మానం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆ బృందం కేంద్రానికి సిఫారసు చేసిందని చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు లాక్ డౌన్ఎత్తివేస్తే ఇప్పటి దాకా చేసిన కష్టం అంతా వృధా అవుతుందని మంత్రుల బృందం అభిప్రాయపడిందని చెబుతున్నారు. ఈ మేరకు మే 15 వరకు లాక్డౌన్ పొడిగించాలనే ఏకాభిప్రాయానికి మంత్రుల బృందం వచ్చినట్లుగా సమాచారం. అయితే లాక్ డౌన్ పొడిగింపునకు ప్రధాని ఆమోదముద్ర వేయాల్సి ఉందని చెబుతున్నారు.