తెలంగాణ గ్రూప్ 1 పోస్టులు అమ్మకానికి పెట్టినట్టు తప్పుడు ప్రచారం.. TGPSC మాస్ వార్నింగ్
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన టీజీపీఎస్సీ ఆ వార్తలను ఖండించింది. అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తామంటూ వార్నింగ్ చేసింది..

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ పబ్లిక్ కమీషన్ (టీజీపీఎస్సీ) మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు మొత్తం 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 31,383 మంది క్వాలిఫై అవగా కేవలం 21,093 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారు. అంటే 67.17 శాతం మాత్రమే పరీక్ష రాశారన్నమాట. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. అయితే తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాలపై కొందరు వ్యక్తులు తప్పుడు వార్తలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించిన టీజీపీఎస్సీ ఆ వార్తలను ఖండించింది.
సోషల్ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరువునష్టం దావా వేస్తామంటూ కమిషన్ ప్రకటించింది. అతి త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మార్కుల జాబితాను వెబ్సైట్లో పెడతామని.. అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులు చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా గ్రూప్ 1 నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతోందని, ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నామనీ పేర్కొంది. సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను అభ్యర్థులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
అసలేం జరిగిదంటే..
టీజీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల అమ్మకమంటూ సోషల్మీడియాలో గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరగడంతో టీజీపీఎస్సీ స్పందించింది. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై మార్చి 5 బేగంబజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే సైబర్ క్రైమ్స్ డీసీపీకి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గ్రూప్ 1 ఆశావాహుల్లో అపోహలు, గందరగోళం సృష్టించేందుకు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ పరువునష్టం దావా వేసినట్టు కమిషన్ ఇన్చార్జి కార్యదర్శి సుమతి తెలిపారు. గ్రూప్1 ఫలితాలను పారదర్శకంగా ప్రాసెస్ చేస్తున్నామని, ఏ అభ్యర్థికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




