TG TET 2025 Notification: తెలంగాణ టెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ప్రభుత్వ టీచర్ కొలువులకు అర్హత సాధించేందుకు యేటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2025-26 విద్యా సంవత్సరానికి టీజీ టెట్ 2025 జూన్ నోటిఫికేషన్ను శుక్రవారం (ఏప్రిల్ 11) విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు కూడా ఏప్రిల్ 11 నుంచే ప్రారంభమైనాయి..

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2025 జూన్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 11 (శుక్రవారం) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు కూడా ఏప్రిల్ 15 నుంచే ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. ఇక టెట్ ఆన్లైన్ ఆధారిత కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2025 జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటన వెలువరించింది. టెట్కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్, షెడ్యూల్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టెట్ పరీక్షలు రెండు పేపర్లకు అంటే.. పేపర్ 1, పేపర్ 2లకు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పేపర్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.750 దరఖాస్తు సమయంలో చెల్లించవల్సి ఉంటుంది. ఇక రెండు పేపర్లు రాసేవారు రూ. 1000 ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. కాగా ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని రేవంత్ సర్కార్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకు ఈ ఏడాదికి తొలి విడత నిర్వహించవల్సిన టెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసి రేవంత్ ప్రభుత్వం మాట మీద నిలబడింది.
డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులతోపాటు కొత్తగా సర్వీస్ టీచర్లు కూడా టెట్కు హాజరవుతున్నారు. వీరికి పదోన్నతులు కావాలంటే వారంతా టెట్ తప్పనిసరిగా పాసై ఉండాలి. ఇక డీఎస్సీ రాసేందుకు డీఎడ్, బీఈడీ అభ్యర్ధులు టెట్లో అర్హత సాధించి ఉండాలి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.