NEET విద్యార్థులకు హెచ్చరిక.. డ్రెస్ కోడ్ నుంచి ఐడీ కార్డు వరకు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
NEET 2026 Dress Code and exam day guidelines: వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్ పరీక్ష నేడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే వారు డ్రెస్ కోడ్, అడ్మిట్ కార్డ్, గుర్తింపు కార్డు వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్టీఏ సూచించింది..

హైదరాబాద్, జూన్ 21: దేశవ్యాప్తంగా 551 దేశీ నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పునఃపరీక్షను ఆదివారం (జూన్ 21) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ రాయనున్నారు. మన రాష్ట్రంలోని 27 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 185 కేంద్రాల్లో 65,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 1500 మంది కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఈ కేంద్రాలన్నింటిలో నీట్ మాక్ డ్రిల్ కూడా పూర్తయ్యింది. ఆదివారం ప్రశ్నాపత్రాలను పోలీస్ భద్రతతో కేంద్రాలకు తరలించనున్నారు. పెన్ను, పేపర్(ఆఫ్లైన్) విధానంలో నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది.
డ్రెస్ కోడ్ తప్పనిసరి
నీట్ రీఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్ధులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థులు తేలికపాటి దుస్తులు మాత్రమే ధరలించాలి. ఫుల్ స్లీవ్స్ చొక్కాలు, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసంనిర్ణీత సమయానికన్నా కాస్త ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు వస్తువులు, ఆభరణాలు ధరించేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేవలం స్లిప్పర్స్, ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. అలాగే పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు ఎన్టీయే నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు అంటే ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణపత్రాలు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎల్రక్టానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.
ఇక దివ్యాంగ విద్యార్థులకు ఎన్టీయే పరీక్ష రాసేందుకు అదనపు సమయం కేటాయించనున్నారు. వీరికి సాయంత్రం 6.20 గంటల వరకూ పరీక్ష రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. అయితే ఈ అదనపు సమయం కేటాయింపుపై కొందరు అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొనడంతో ఎన్టీఏ మరోమారు స్పష్టత ఇచ్చింది. అందుకు కారణం సాధారణ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో అదనపు సమయం కాలమ్ దగ్గర ‘వై’ అని ముద్రించడమే. నిజానికి ఆ కాలమ్ దగ్గర ‘YES’ అని ముద్రించిన దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే అదనపు సమయం కేటాయించినట్లు ధృవీకరణం కోసం ఇది ఉంటుందని వెల్లడించింది. శనివారం రాత్రి 7 గంటల వరకూ కూడా కొందరు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేదని గుర్తించిన ఎన్టీయే.. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సాప్ ద్వారా అడ్మిట్ కార్డులు పంపినట్లు ఎన్టీఏ తెలిపింది.




