JEE Main 2025 Session 1 Exams: జేఈఈ మెయిన్ సెషన్ 1 రెండో దశ పరీక్షలు నేటి నుంచి పునఃప్రారంభం.. వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు పునఃప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జనవరి 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎన్టీయే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సూచనలు జారీ చేసింది..

హైదరాబాద్, జనవరి 28: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలివిడత ఆన్లైన్ పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. అయితే జనవరి 22, 23, 24 తేదీల్లో జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు పూర్తవగా.. మంగళవారం నుంచి తిరిగి ఈ పరీక్షలు పునఃప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దీంతో జనవరి 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షల్లో తొలి సెట్ ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరిగగా.. తదుపరి సెట్ పరీక్షలు జనవరి 28, 29, 30 తేదీల్లో జరుగుతాయని పేర్కొంది. అభ్యర్ధులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులపై నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు హాజరు కావాలని, గేట్లు మూసేసిన తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక చివరి రోజు జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 జరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ రెండు పేపర్లకు కలిపి దాదాపు 14 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు లక్షన్నర మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండో సెషన్ ఈ పరీక్షలు జరుగుతాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జేఈఈ మెయిన్ 2025 రెండో విడత పరీక్షలు జరుగుతాయి. ఈ రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో దేశ వ్యాప్తంగా 31 ఎన్ఐటీల్లో, అడ్వాన్స్డ్ ర్యాంకులతో 23 ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.